ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రొడ్యూసర్గా బాలీవుడ్ హీరో.. మలయాళం నటి లీడ్ రోల్లో..
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ అరుదైన కాంబినేషన్ గురించి ప్రైమ్ వీడియో శుక్రవారం (అక్టోబర్ 10) సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓటీటీలోకి నిర్మాతగా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ముంబై నేపథ్యంలో రూపొందే 'స్టార్మ్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం హృతిక్.. ప్రైమ్ వీడియో తో కలిసి పనిచేస్తున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 10) అనౌన్స్ చేశాడు. ఇది హృతిక్ రోషన్, అతని బ్యానర్ అయిన హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్ మధ్య సహకారంతో నిర్మిస్తున్న వెబ్ సిరీస్.

వెబ్ సిరీస్ వివరాలు ఇవీ..
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానున్న ఈ వెబ్ సిరీస్ను అజిత్పాల్ సింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేస్తున్నాడు. కథను అజిత్పాల్ సింగ్, ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ రాశారు. ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువోతుతోపాటు అలయ ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'స్టార్మ్' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇది ముంబై నేపథ్యంలో సాగే ఒక హై-స్టేక్స్ థ్రిల్లర్ డ్రామాగా చెబుతున్నారు.
హృతిక్ రోషన్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి నిర్మాతగా అడుగుపెడుతున్న హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. "స్ట్రీమింగ్ రంగంలో నిర్మాతగా నా అరంగేట్రానికి 'స్టార్మ్' నాకు సరైన అవకాశాన్ని ఇచ్చింది. అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించడంలో మంచి రికార్డు ఉన్న ప్రైమ్ వీడియోను ఎంచుకోవడం సహజంగా జరిగింది" అని అన్నాడు.
"అజిత్పాల్ క్రియేట్ చేసిన ఈ ఆకర్షణీయమైన ప్రపంచం నన్ను 'స్టార్మ్' వైపు ఆకర్షించింది. కథ చాలా వాస్తవంగా, శక్తివంతంగా ఉంది. ఇందులో అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులు పోషించబోయే మరపురాని పాత్రలు ఉన్నాయి. ఈ సిరీస్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది" అని అతడు చెప్పాడు.
ప్రైమ్ వీడియో ఏం చెప్పిందంటే?
ప్రైమ్ వీడియో వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ ఈ వెబ్ సిరీస్ పై స్పందించారు. హృతిక్ రోషన్ తో కలిసి వెబ్ సిరీస్ తీసుకువస్తుండటం ఓ ముఖ్యమైన మైల్ స్టోన్ అని అన్నారు. స్టార్మ్ ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో ఇది మరిన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించనుంది. స్ట్రీమింగ్ తేదీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


