Prakash Raj: ప్రకాష్ రాజ్ అరెస్ట్ తప్పదా.. నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ కేసుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Prakash Raj: ప్రకాష్ రాజ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ కేసుపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ధర్మస్థల వివాదంలో నటుడు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ధర్మస్థల ఆలయ వివాదంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే.. బెంగళూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఒకేసారి 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలా? అసలు వివాదం ఇదే..
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) కథనం ప్రకారం.. బెంగళూరులోని 48వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) కోర్టు ప్రకాష్ రాజ్ పై ఈ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఆయన పదే పదే బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరవకపోవడం వల్లే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చిందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ కేసు గతంలోకి వెళ్తే.. 2019 లో బెంగళూరుకు చెందిన అడ్వకేట్ దిలీప్ కుమార్ అక్కడి హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ పై ఒక ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ ఒకే సమయంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ గా రిజిస్టర్ అయి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనేది ఆ పిటిషన్ లోని ముఖ్యమైన ఆరోపణ.
భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం ఏ పౌరుడైనా దేశంలో కేవలం ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్ ఐడీ ఉంటే అది చట్టరీత్యా నేరం. అయితే గతంలో ప్రకాష్ రాజ్ ఈ ఆరోపణలను ఖండించారు, తాను కేవలం తమిళనాడు నుండి మాత్రమే ఓటు వేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వారెంట్ రావడంతో ఆయన లీగల్ టీమ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంది.
ధర్మస్థల వివాదం ఏంటి?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల (Dharmasthala) టౌన్ లో భారీ స్థాయిలో హత్యాకాండలు, అత్యాచారాలు జరిగాయంటూ సీఎన్ చిన్నయ్య అనే వ్యక్తి గతంలో సంచలన ఆరోపణలు చేశారు. ఐతే తాజాగా ఆయన కర్ణాటక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేస్తూ.. ధర్మస్థల క్షేత్రం ప్రతిష్టను దిగజార్చడానికి, ఫండ్స్ ఆశ చూపి తనను ఒక పెద్ద కుట్రలోకి వాడుకున్నారని, ఇందులో ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉందని పేర్కొన్నారు.
ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. "సామాజిక కార్యకర్త గిరీష్ మత్తన్నవర్ నా దగ్గరకు వచ్చి, చిన్నయ్య నాతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒక బాధ్యతగల పౌరుడిగా నేను వెంటనే ఆ విషయాన్ని ఎస్ఐటీ (SIT) చీఫ్ ప్రణబ్ మొహంతికి పాస్ చేశాను. చిన్నయ్య నాతో ఫోన్ లో మాట్లాడిన మాట నిజమే. ఆ వివరాలను నేను అప్పుడే అధికారులకు ఇచ్చి నా బాధ్యతను నిరూపించుకున్నాను. ఇక్కడితో నా పాత్ర ముగిసింది" అని ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు.
ప్రకాష్ రాజ్ కెరీర్ విశేషాలు
ప్రకాష్ రాజ్ రీసెంట్ గా తెలుగులో 'డెకాయిట్: ఎ లవ్ స్టోరీ', తమిళంలో 'కాళిదాస్ 2' చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేతిలో భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. హిందీలో మోస్ట్ ఎవైటెడ్ 'దృశ్యం 3', టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా ల 'స్పిరిట్' (Spirit), 'వారణాసి' చిత్రాలతో పాటు కోలీవుడ్ లో దళపతి విజయ్ చివరి మూవీ 'జననాయగన్' (Jana Nayagan) లో కూడా ప్రకాష్ రాజ్ ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


