భైరవం రివ్యూ.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ముగ్గురు హీరోల తమిళ రీమేక్ మూవీ ఎలా ఉందంటే?
భైరవం సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ మూవీకి తెలుగు రీమేక్గా వచ్చిన భైరవం సినిమా ఇవాళ (మే 30) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో భైరవం రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: భైరవం

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, జయసుధ, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్, రాజా రవీంద్ర, అజయ్, శరత్ లోహితస్వ తదితరులు
దర్శకత్వం: విజయ్ కనకమేడల
సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: కెకె రాధా మోహన్
విడుదల తేది: మే 30, 2025
తమిళంలో సూపర్ హిట్ కొట్టిన సినిమా గరుడన్. అదే కథతో తెలుగు నెటివిటీకి తగినట్లుగా తెరకెక్కిన సినిమా భైరవం. సినిమాల్లో కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇవాళ (మే 30) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో భైరవం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), గజపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఊరిలో వారాహి అమ్మవారి గుడికి చెందిన భూములను మంత్రి (శరత్ లోహితాస్య) కాజేయాలని ప్రయత్నిస్తాడు. కానీ, దానికి అడ్డంగా ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ గుడికి ధర్మకర్తగా ఉన్న గజపతి నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) అకస్మాత్తుగా చనిపోతుంది.
భైరవం ట్విస్టులు
దాంతో గజపతి దగ్గర పనిచేసే శీను గుడికి ధర్మకర్త అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శీను ధర్మకర్త ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? గుడి భూములు కాజేసేందుకు మంత్రి వేసిన స్కెచ్ ఏంటీ? ఒక తల్లి బిడ్డలుగా ప్రాణంగా పెరిగిన ముగ్గురు స్నేహితుల మధ్య రగులుకున్న చిచ్చు ఏంటీ? చివరికీ ఏమైంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే భైరవం చూడాల్సిందే.
విశ్లేషణ:
భైరవం ఒక సూపర్ హిట్ తమిళ రీమేక్ మూవీ. కథను అలాగే ఉంచి తెలుగు నెటివిటీకి తగినట్లుగా పలు మార్పులు చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆ విషయంలో సక్సెస్ సాధించరానే చెప్పొచ్చు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన ముగ్గురు హీరోలను పర్ఫెక్ట్గా వాడుకున్నారు.
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు స్క్రీన్ ప్రజెన్స్ సమతుల్యంగా ఉంది. ముగ్గురికి కరెక్ట్ క్యారెక్టరైజేషన్ పడింది. అలాగే, ముగ్గురిని కొత్త కోణంలో చూపించారు డైరెక్టర్. సినిమా అంతా ముగ్గురు ప్రాణ స్నేహితులు, వారి జీవితం, గుడి మాన్యం చుట్టూనే సాగుతుంది. సినిమా కథ కాస్తా రొటీన్గా అనిపించొచ్చు. కానీ, హీరోలు తమ నటనతో ఆకట్టుకున్నారు.
గరుడన్ చూడని వాళ్లకు మాత్రం
అయితే, ఇదివరకే గరుడన్ సినిమా చూసిన వాళ్లకు భైరవం పెద్దగా ఎలాంటి థ్రిల్, సర్ప్రైజ్లు ఇవ్వదు. కేవలం నటీనటుల యాక్టింగ్ తప్పా. కానీ, ఆ తమిళ సినిమా చూడని వాళ్లకు మాత్రం భైరవం మంచి ట్విస్టులు, క్యారెక్టర్స్లలో సర్ప్రైజ్లు ఉంటాయి. హీరోల ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్ పూనకం ఎపిసోడ్ అయితే హైలెట్గా నిలుస్తుంది. ఇక శ్రీ చరణ్ పాకాల బీజీఎమ్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్కు మంచి ఎలివేషన్ ఇచ్చేలా ఉంది. పాటలు సోసోగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాత కెకె రాధా మోహన్ డబ్బులు పెట్టిన రిచ్ నెస్ తెలుస్తుంది. ఎడిటింగ్ ఓకే. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నా ఎమోషన్ అంతగా వర్కౌట్ కాలేదు. వాటిపై మరింత ఫోకస్ చేయాల్సింది.
అదరగొట్టిన హీరోలు
ఇక పాత్రల విషయానికొస్తే హీరోలు ఎవరి క్యారెక్టర్లో వారు అదరగొట్టారు. ప్రతి ఒక్కరు తమ నటనతో ఆశ్చర్యపరిచారు. వారికి చాలం కాలం గ్యాప్ తర్వాత పర్ఫెక్ట్ లాంచ్ భైరవం సినిమా. నారా రోహిత్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మంచు మనోజ్ రెండు షేడ్సులో ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అయితే, అదితి శంకర్ డబ్బింగ్ సెట్ కాలేదు.
ఆనంది, దివ్యా పిళ్లై బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. ఇక ఫైనల్గా చెప్పాలంటే.. రొటీన్ ఫార్ములా కనిపించే భైరవం ముగ్గురు హీరోల యాక్టింగ్తో నచ్చేలా ఉంటుంది.

E-Paper












