ఇండస్ట్రీలో నమ్మిన వాళ్లే మోసం చేశారు.. దారుణమైన మనుషులు ఉన్నారు.. వాళ్లకు ఎథిక్స్ లేవు: నటి సంచలన పోస్ట్
బాలీవుడ్ నటి రిచా చద్దా శుక్రవారం (డిసెంబర్ 12) చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో నమ్మిన వాళ్లే మోసం చేశారంటూ ఆమె చెప్పడం గమనార్హం. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సుమారు రెండేళ్లకు తాను తిరిగి షూటింగ్ కు వెళ్లినట్లు చెప్పింది.
బాలీవుడ్ నటి రిచా చద్దా తన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ షూటింగ్కు వెళ్తున్న ఆమె.. ప్రెగ్నెన్సీ సమయంలో తాను పడిన శారీరక, మానసిక వేదనను, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న నమ్మక ద్రోహాలను బయటపెట్టింది. తన కూతురి తొలి ఫోటోను షేర్ చేస్తూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రిచా చద్దా పోస్ట్ ఇలా..
'హీరామండి' వెబ్ సిరీస్ నటి రిచా చద్దా ఇటీవల తన భర్త అలీ ఫజల్ తో కలిసి మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకుని షూటింగ్కు సిద్ధమయింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో తన కూతురితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, తల్లిగా మారిన తర్వాత తన ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో వివరిస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ రాసింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని ఆమె బయటపెట్టింది.
"క్షమిస్తా.. కానీ మర్చిపోలేను"
గత ఆదివారం నాడు రెండేళ్ల తర్వాత మళ్లీ పనిలో చేరానని చెప్పిన రిచా, తన మనసులోని ఆవేదనను ఇలా వెల్లడించింది.
"నేను త్వరగా షూటింగ్ లోకి తిరిగి రావాలనుకున్నప్పటికీ, నా శరీరం, నా మనస్సు అందుకు అస్సలు సహకరించలేదు. డెలివరీ తర్వాత ఉండే శారీరక, మానసిక ఇబ్బందులే కాకుండా.. వృత్తిపరంగా నేను ఎదుర్కొన్న నమ్మక ద్రోహాలను కూడా తట్టుకోవాల్సి వచ్చింది" అని చెప్పింది. ఇండస్ట్రీలో చాలా కొద్ది మందికి మాత్రమే ఎథిక్స్, ధైర్యం ఉంటాయని స్పష్టం చేసింది.
కొందరు వ్యక్తుల తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేసింది. "కొంతమంది తీవ్రమైన న్యూనతా భావంతో, సంకుచిత మనస్తత్వంతో బతుకుతుంటారు. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. జీవితంలో ఉన్న ఆనందాన్ని పీల్చేసే రాక్షసుల్లాంటి వారు. నేను అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో నా పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వారికి తగినంత ప్రేమ దొరకలేదేమో.. అందుకే అలా తయారయ్యారు. నేను వారిని క్షమిస్తాను.. కానీ వారు చేసిన పనిని ఎప్పటికీ మర్చిపోను" అని రిచా ఘాటుగా స్పందించింది.
తల్లిగా మారడం.. కొత్త సవాలు
బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా కోలుకోవడానికి తాను అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టిందని రిచా అంగీకరించింది. "బిడ్డను పెంచడానికి ఒక ఊరు మొత్తం కావాలంటారు.. కానీ తల్లి తన సొంత గుర్తింపును తిరిగి నిర్మించుకోవడానికి కూడా అంతే అద్భుతమైన మద్దతు అవసరం" అని ఆమె పేర్కొంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలనే ఒత్తిడి, తమ వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకునేలా చేసే కల్చర్ పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తన ఎమోషన్స్ను పాడ్కాస్ట్లలో చర్చనీయాంశం చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది.
రిచా తదుపరి సినిమాలు
చివరగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హీరామండి' వెబ్ సిరీస్లో రిచా మెప్పించింది. మెటర్నిటీ బ్రేక్ తర్వాత ఆమె పలు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. వాటిలో అమితోష్ నాగ్పాల్ రాసిన నార్త్ ఇండియన్ కామెడీ మూవీలో నటించనుంది. ఆఖరి సోమవార్ అనే ఈ డ్రామెడీ చిత్రానికి ఆమె నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. స్త్రీలపై పెళ్లి కోసం ఉండే సామాజిక ఒత్తిడి చుట్టూ తిరుగుతుంది. ఇక ఇండో-బ్రిటీష్ డ్రామా 'ఐనా' (Aaina) ద్వారా ఆమె అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనుంది.














