నాలుగేళ్లపాటు కామెడీ నుంచి బ్రేక్ తీసుకున్న పాపులర్ కమెడియన్.. హైదరాబాద్ షోలోనే అనౌన్స్మెంట్.. కారణం ఇదే
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ కామెడీ నుంచి సుదీర్ఘ విరామం తీసుకోనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన తన లైవ్ షోలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఆరోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ బ్రేక్ 2030 వరకు కూడా ఉండొచ్చని చెప్పడంతో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.
"సక్త్ లౌండా"గా (Sakht Launda) యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ తన అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తన కామెడీ ప్రదర్శనలకు చాలా కాలం పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుతం తన ‘పాపా యార్’ టూర్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన షోలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగేళ్లపాటు కామెడీ నుంచి బ్రేక్ తీసుకున్న పాపులర్ కమెడియన్.. హైదరాబాద్ షోలోనే అనౌన్స్మెంట్.. కారణం ఇదే
3 నుంచి 5 ఏళ్లు బ్రేక్..
హైదరాబాద్లోని ఆడిటోరియం కిక్కిరిసి ఉండగా కమెడియన్ జాకీర్ ఖాన్ మైక్ పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. "నా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి, కొన్ని వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడానికి నేను 3, 4 లేదా 5 ఏళ్లు బ్రేక్ తీసుకుంటున్నాను. అంటే నేను మళ్లీ 2028, 2029 లేదా 2030లో తిరిగి రావచ్చు. ఈ రోజు ఇక్కడ ఉన్న మీరందరూ నాకు చాలా ప్రత్యేకం. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జాకీర్ పేర్కొన్నారు.
అసలు కారణం ఏంటి?
గత కొన్నేళ్లుగా విరామం లేకుండా టూర్లు, ప్రదర్శనలు ఇవ్వడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు జాకీర్ గతంలోనే (గతేడాది సెప్టెంబర్లో) తెలిపారు. నిద్రలేని రాత్రులు, సరిగ్గా భోజనం లేకపోవడం, వరుస ప్రయాణాలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. దాదాపు ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, స్టేజ్ మీద ఉన్న ప్రేమతో షోలు చేస్తూ వచ్చానని, కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయలేనని ఆయన స్పష్టం చేశారు.
జూన్ 20 వరకే..
తన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. జూన్ 20 వరకు ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేస్తానని, ఆ షోలన్నీ ఒక సెలబ్రేషన్లా ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత తన స్పెషల్ను రికార్డ్ చేసి, పూర్తిగా కోలుకోవడానికి లాంగ్ బ్రేక్ తీసుకుంటానని వెల్లడించారు. ఈసారి ఎక్కువ నగరాల్లో పర్యటించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. స్టాండప్ కమెడియన్ తోపాటు పలు వెబ్ సిరీస్ లలోనూ జాకిర్ ఖాన్ నటించాడు. అతని కామెడీ టైమింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా అతడు చేసిన అనౌన్స్మెంట్ మాత్రం ఫ్యాన్స్ కు మింగుడు పడనిదే.