Vijay Khsubhu: విజయ్ నా భార్య ఖుష్బూకి తమ్ముడిలాంటి వాడు.. అందుకే అతన్ని ఏమీ అనను: డైరెక్టర్ సుందర్

Vijay Khsubhu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్ నుండి పోటీ చేస్తున్నట్లు సుందర్ సి ప్రకటించారు. అయితే ప్రత్యర్థిగా ఉన్న విజయ్ (TVK) గురించి మాట్లాడుతూ, ఆయన తన భార్య కుష్బూకు తమ్ముడి వంటి వాడని, అందుకే విమర్శించనని స్పష్టం చేశారు.

Published on: Apr 1, 2026, 22:13:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏఐఏడీఎంకే (AIADMK) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమిలో భాగమైన 'పుదియ నీది కట్చి' (PNK) అభ్యర్థిగా ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 1) మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ ప్రయాణం, తోటి నటుడు విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Vijay Khsubhu: విజయ్ నా భార్య ఖుష్బూకి తమ్ముడిలాంటి వాడు.. అందుకే అతన్ని ఏమీ అనను: డైరెక్టర్ సుందర్
Vijay Khsubhu: విజయ్ నా భార్య ఖుష్బూకి తమ్ముడిలాంటి వాడు.. అందుకే అతన్ని ఏమీ అనను: డైరెక్టర్ సుందర్

విజయ్ మా కుటుంబ సభ్యుడు.. విమర్శించను

రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజం. కానీ సుందర్ సి మాత్రం విజయ్ విషయంలో భిన్నంగా స్పందించారు. విజయ్ పార్టీని లేదా ఆయన అభ్యర్థులను విమర్శిస్తారా? అని ప్రశ్నించగా.. "విజయ్ సార్‌కు నాపై చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. నాకూ ఆయనపై అంతే గౌరవం ఉంది. నా భార్య కుష్బూ ఆయన్ని తన 'తంబి' (తమ్ముడు)గా భావిస్తుంది. విజయ్ కూడా ఆమెను 'అక్కా' అని పిలుస్తారు. మా మధ్య ఉన్న ఈ కుటుంబ బంధం దృష్ట్యా, విజయ్‌ని గానీ, ఆయన పార్టీని గానీ, వారి అభ్యర్థులను గానీ నేను విమర్శించలేను" అని సుందర్ సి కుండబద్దలు కొట్టారు. అయితే మదురై సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ మాత్రం డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్యే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మదురైపై ప్రత్యేక దృష్టి

గత 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించానని గుర్తు చేసుకున్న సుందర్ సి.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. తనకు అవకాశం కల్పించిన ఏసీ షణ్ముగానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. "నేను ఎన్నికల్లో విజయం సాధిస్తే, ప్రతి నెలా 15 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఈ ఎన్నికల ఫలితాలే నా తదుపరి అడుగును నిర్ణయిస్తాయి" అని ఆయన వెల్లడించారు. సుందర్ సి భార్య కుష్బూ ప్రస్తుతం బీజేపీ తమిళనాడు విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

ఎన్నికల వేళ విజయ్ కష్టాలు

మరోవైపు దళపతి విజయ్ తన 'టీవీకే' (TVK) పార్టీతో ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2024 నుండి భారీ బహిరంగ సభలు (మానాడు) నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న విజయ్‌కు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. 2025లో కరూరు ర్యాలీలో తొక్కిసలాట జరగడం, కొన్ని ప్రాంతాల్లో సభలకు అనుమతి నిరాకరించడం వంటివి ఆయనను చుట్టుముట్టాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో విజయ్, ఆయన పార్టీ కార్యకర్తలపై పోలీస్ కేసు కూడా నమోదైంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. అటు వ్యక్తిగత జీవితంలోనూ భార్య సంగీతతో విడాకులు, త్రిషతో అనుబంధం వంటి వార్తలతో విజయ్ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. సుందర్ సి విషయానికి వస్తే, ఆయన దర్శకత్వంలో 'మూకుత్తి అమ్మన్ 2', 'పురుషన్' వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More