Sowcar Janaki: జూనియర్ ఎన్టీఆర్ నుంచి విజయ్ వరకు.. షావుకారు జానకి మృతిపై సినీలోకం నివాళులు
Sowcar Janaki: లెజెండరీ నటి షావుకారు జానకి మృతిపై తెలుగు, తమిళ ఇండస్ట్రీల ప్రముఖులు నివాళులు అర్పించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమిళనాడు సీఎం విజయ్, నటుడు కమల్ హాసన్ వరకు సోషల్ మీడియా ద్వారా జానకి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Sowcar Janaki: భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఏడు దశాబ్దాలకు పైగా ఐకానిక్ పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి 'షావుకారు' జానకి (94) చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (ఆగస్టు 21, 2026) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో ఉన్న ఆమె తుదిశ్వాస విడవడంతో సౌత్ సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

70 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. 'షావుకారు'తో మొదలైన సంచలనం
1931లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించిన జానకి.. 1950లో విజయ వాహిని స్టూడియోస్ నిర్మించిన 'షావుకారు' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ సరసన చేసిన ఆ మొదటి సినిమానే బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఆమె ఇంటిపేరు 'షావుకారు' జానకిగా స్థిరపడిపోయింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో ఏకంగా 400కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషన్, ఎమ్జీఆర్ లాంటి నాటి దిగ్గజ హీరోల సరసన హీరోయిన్గా నటించడమే కాకుండా.. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందలాది పవర్ఫుల్ రోల్స్ చేశారు.
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ నివాళి
షావుకారు జానకి మరణవార్త వినగానే టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "షావుకారు చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసిన గొప్ప నటి ఆమె. ఇండియన్ సినిమాలో ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని సంతాపాన్ని తెలిపారు.
మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. "తెలుగు, భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. ఆమె సినీ ప్రయాణం, పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కమల్ హాసన్, తమిళనాడు సీఎం విజయ్ కన్నీటి వీడ్కోలు
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ స్పందిస్తూ.. "తన ప్రత్యేకమైన నటనతో తరతరాల అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న షావుకారు జానకి గారు కన్నుమూశారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పద్మశ్రీ, కలైమామణి, నంది అవార్డులు అందుకున్న ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు" అని సంతాప సందేశం ఇచ్చారు.
లోకనాయకుడు కమల్ హాసన్ ఎమోషనల్ అవుతూ.. "40 ఏళ్ల క్రితం 'పార్థాల్ పసి తీరుమ్' సినిమా నుంచి మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో వర్క్ చేశాం. ఆమె నా తల్లిగా నటించారు. నా గురువు కే. బాలాచందర్ గారికి అత్యంత ప్రియమైన నటి ఆమె. ఒక తల్లి లాంటి వ్యక్తికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నాను" అని ట్వీట్ చేశారు.
జానకి అవార్డులు, చివరి సినిమాలు
భారత చిత్రసీమకు చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది. దీంతో పాటు అనేక నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.
వయసు పైబడినప్పటికీ నటనపై ఉన్న మక్కువతో చివరి వరకు కెమెరా ముందుకు వచ్చారు. తమిళంలో 2020లో వచ్చిన 'బిస్కోత్', తెలుగులో 2023లో వచ్చిన 'అన్ని మంచి శకునములే' ఆమె నటించిన చివరి చిత్రాలుగా నిలిచాయి. ఆమె మృతిపట్ల మంచు విష్ణు, రాధిక శరత్కుమార్, ప్రభుదేవా సహా ఎంతోమంది ప్రముఖులు నివాళులు అర్పించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


