Michael Jackson Biopic Movie: ఇదేం సినిమా రా బాబు.. ఏదో అనుకుంటే మరేదో అయింది.. మైఖేల్ సినిమాకు నెగటివ్ రివ్యూలు
Michael Jackson Biopic Movie: మైఖేల్ మూవీకి వస్తున్న ఫస్ట్ రివ్యూలు మైఖేల్ జాక్సన్ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు క్రిటిక్స్ నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అటు రోటెన్ టొమాటోస్ లోనూ కేవలం 35 శాతం రేటింగ్ నమోదైంది.
Michael Jackson Biopic Movie: పాప్ సంచలనం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' సినిమాపై రివ్యూలు వచ్చేశాయి. జాఫర్ జాక్సన్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ, కథనం విషయంలో విమర్శకులు పెదవి విరుస్తున్నారు. దీంతో రోటెన్ టొమాటోస్ లో ప్రస్తుతానికి దీనికి కేవలం 35 శాతం రేటింగ్ మాత్రమే నమోదైంది.

బాక్సాఫీస్ వద్ద 'మైఖేల్' సందడి.. కానీ రివ్యూలు రివర్స్
ప్రపంచవ్యాప్తంగా పాప్ మ్యూజిక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'మైఖేల్'. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో, మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్ ప్రీమియర్ షోల తర్వాత మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.
ముఖ్యంగా ప్రముఖ రివ్యూ సైట్ 'రోటెన్ టొమాటోస్' (Rotten Tomatoes)లో ఈ సినిమా కేవలం 27 శాతం రేటింగ్తో జర్నీ మొదలుపెట్టడం ఇప్పుడు హాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ రేటింగ్ స్వల్పంగా పెరిగి 35 శాతానికి చేరుకున్నా.. విమర్శకుల మనసు గెలవడంలో మాత్రం ఈ మూవీ వెనుకబడిందనే చెప్పాలి.
జాఫర్ అదరగొట్టాడు.. కానీ కథలో ఆత్మ లేదు
మైఖేల్ జాక్సన్ పాత్రలో జాఫర్ జాక్సన్ పరకాయ ప్రవేశం చేశాడని దాదాపు ప్రతి విమర్శకుడు ప్రశంసిస్తున్నారు. ఆయన గొంతు, నృత్య రీతులు, హావభావాలు అచ్చం మైకేల్ను తలపిస్తున్నాయని 'వెరైటీ' (Variety) వంటి ప్రముఖ పత్రికలు కొనియాడాయి.
అయితే కేవలం నటన బాగుంటే సరిపోదు కదా.. కథనం విషయానికి వస్తే సినిమా చతికిలపడిందని విమర్శలు వస్తున్నాయి. మైఖేల్ జాక్సన్ జీవితంలోని కేవలం కొన్ని హైలైట్స్ ను స్పృశిస్తూ పోవడమే తప్ప.. ఆయన జీవితంలోని అసలు సంఘర్షణను చూపించడంలో దర్శకుడు విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది.
వివాదాలకు దూరంగా.. అసలైన కథ ఎక్కడ?
ఈ సినిమాపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ 'కథలో లోతు లేకపోవడం'. 'బీబీసీ' (BBC) ఈ సినిమా 1 స్టార్ రేటింగ్ ఇస్తూ కఠినమైన విమర్శలు చేసింది. జాక్సన్ 5 గ్రూప్ నుండి సోలో కెరీర్ వరకు జరిగిన ప్రయాణాన్ని చూపించిన దర్శకుడు.. 1980వ దశకం మధ్యలోనే కథను ఆపేయడం గమనార్హం.
ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఇతర వివాదాలను ముట్టుకోకుండా కేవలం సాఫ్ట్ కార్నర్లో సినిమాను నడిపించారని, దీనివల్ల డ్రామా కరువైందని విమర్శకులు పెదవి విరుస్తున్నారు. "ఇదొక అసంపూర్ణ కథ" అని 'ఐజీఎన్' (IGN) అభివర్ణించగా.. "చూస్తున్నంత సేపు చిరాకు తెప్పిస్తుంది" అని 'ది రాప్' (The Wrap) ఘాటుగా స్పందించింది.
అభిమానులకు మాత్రం కనువిందే
ఒకవైపు విమర్శకులు తప్పులు వెతుకుతున్నా, మరికొన్ని సంస్థలు సినిమాను సమర్థిస్తున్నాయి. 'స్క్రీన్ రాంట్' (ScreenRant) ఈ సినిమాను 'మాస్టర్ పీస్' అని పేర్కొంది. కాస్ట్యూమ్స్, కాన్సర్ట్ సీక్వెన్స్లు, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయని, మైఖేల్ జాక్సన్ లెజెండరీ ఇమేజ్కు తగ్గట్టుగా సినిమా ఉందని ప్రశంసించింది.
సినిమా మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా కమర్షియల్గా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్' ఎప్పుడు విడుదలవుతోంది?
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
2. మైఖేల్ జాక్సన్ పాత్రను ఎవరు పోషించారు?
మైఖేల్ జాక్సన్ స్వయానా మేనల్లుడు (జెర్మైన్ జాక్సన్ కుమారుడు) జాఫర్ జాక్సన్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. ఇది ఆయనకు మొదటి సినిమా.
3. ఈ సినిమాకు రోటెన్ టొమాటోస్ రేటింగ్ ఎంత వచ్చింది?
ప్రస్తుతానికి ఈ సినిమాకు 35 శాతం స్కోర్ మాత్రమే లభించింది. విమర్శకులు దీనిని 'రోటెన్' (నిరాశాజనకం) కేటగిరీలో చేర్చారు.
4. సినిమాలో మైఖేల్ జాక్సన్ జీవితంలోని వివాదాలను చూపించారా?
ప్రాథమిక రివ్యూల ప్రకారం.. దర్శకుడు వివాదాస్పద అంశాలను పెద్దగా స్పృశించలేదు. ముఖ్యంగా 1990ల నాటి ఆరోపణల జోలికి వెళ్లకుండా 1980ల నాటి విజయాలతోనే సినిమాను ముగించినట్లు తెలుస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


