ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధితో పాటు హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఇక గతంలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో… ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్ ఛాంబర్లో కలిశారు. హిందూపురం నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలప ఆయనతో చర్చించారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ - ఎమ్మెల్యే బాలకృష్ణ
ఆసక్తికరంగా భేటీ..!
గతేడాది సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలాల్లో బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి . సినిమా టికెట్ల పెంపు విషయంలో చిరంజీవి వ్యవహారశైలిని ఎత్తి చూపేలా మాట్లాడారు. సినిమా టికెట్ల ధరల పెంపు కోసం జగన్ ప్రభుత్వంతో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. చిరంజీవిని పరోక్షంగా విమర్శిస్తూనే….ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (FDC) సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులే కాకుండా జనసేన వర్గాల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓ దశలో బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్, నాగబాబు ఎందుకు స్పందించటం లేదన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.ఈ వివాదం తర్వాత… తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ కలవటం ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరి భేటీలో కేవలం నియోజకవర్గ సమస్యలే కాకుండా సినీ రంగ సమస్యలు కూడా చర్చకు రావొచ్చని తెలుస్తోంది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ఉంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్, బాలకృష్ణ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఇటీవలే చెప్పారు. ఈ నేపథ్యంలో నంది అవార్డుల ప్రదానంతో పాటు సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది…!