Podarillu September 12 Episode: పొదరిల్లు.. మాధవ దుర్మార్గుడు.. జయంతి తల్లితో తాయారు ఫైట్.. చక్రి, మహా, నారాయణ తంటాలు
Podarillu Serial September 12 Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 12 ఎపిసోడ్ లో మాధవ, జయంతి నిశ్చితార్థాన్ని ఆపడానికి చక్రి, మహా, కేశవ నానా తంటాలు పడుతుంటారు. నారాయణ ఓ అదిరిపోయే ప్లాన్ వేసినా గాయత్రి అడ్డు పడుతుంది.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మాధవ ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం శైలుయే అని అందరికీ తెలుస్తుంది. దీంతో నిశ్చితార్థాన్ని చెడగొట్టడానికి చక్రి, మహా, కేశవ, నారాయణ ఏవేవో ప్లాన్స్ వేస్తుంటారు. అటు జయంతి తండ్రికి కూడా ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు.

మాధవను కలిసిన శైలు.. మొత్తం వినేసిన కేశవ
మాధవను శైలు కలిసే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. బావగారిని కలిసి థ్యాంక్స్ చెబుతానని కేశవకు చెప్పి వెళ్తుంది. మాధవ దగ్గరికి వెళ్లి నిశ్చితార్థం చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు థ్యాంక్స్ కూడా చెబుతుంది.
నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా.. నువ్వు చెప్పకపోతే ఈ పెళ్లి చేసుకునేవాడినే కాదు.. మీ పెళ్లికి కేశవ అలాంటి కండిషన్ పెట్టాడని నాకు తెలియదు.. మీ ఇంట్లో వాళ్ల గొడవ వల్ల మీ పెళ్లి జరగడం లేదని అనుకున్నాను.. కానీ మీ పెళ్లికి నేనే అడ్డుగా ఉన్నానని నువ్వు చెప్పిన తర్వాతే తెలిసింది.. నా పెళ్లి కాగానే వెంటనే మీ పెళ్లి జరిపిస్తాను అని పెద్ది అంటాడు. ఇదంతా బయట నుంచి కేశవ వింటాడు.
శైలుని నిలదీసిన కేశవ.. ఎదురు తిరిగిన శైలు.. వెళ్లగొట్టిన ముంగిస
శైలు బయటకు రాగానే కేశవ గుర్రుగా చూస్తాడు. ఆమెను బయటకు లాక్కెళ్తాడు. శైలుని నిలదీసి కొట్టబోతాడు. దీంతో చక్రి, మహా, నారాయణ, కన్నా అక్కడికి వస్తారు. పెళ్లి ఇంట్లో ఇలా ఓ అమ్మాయిపై చేయి చేసుకుంటున్నావేంటని అడుగుతారు. ఇది ఏం చేసిందో తెలిస్తే కొట్టడం కాదు.. మీరైతే చంపేస్తారని కేశవ అంటాడు. అన్నయ్య ఇలాంటి సంబంధం ఒప్పుకోవడానికి కారణం ఇదే.. తన వల్లే మా పెళ్లి జరగడం లేదని అన్నయ్యతో చెప్పింది.. దీంతో ఆయన హడావిడిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పడంతో అందరూ షాకవుతారు.
కేశవ ఇంకా తిడుతూనే ఉండటంతో శైలు ఎదురు తిరుగుతుంది. నేనేం తప్పు చేశాను.. పెద్ది పెళ్లి చేసుకోవడం తప్పా.. అయినా ఆయన పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అంటూ అందరినీ నిలదీస్తుంది. దీంతో కేశవ మరింత రెచ్చిపోతాడు. నిన్ను అసలు పెళ్లే చేసుకోను.. నిన్ను చూస్తేనే ఒళ్లు మండిపోతోంది.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని శైలుని వెళ్లగొడతాడు.
నిశ్చితార్థాన్ని ఆపాలన్న కేశవ.. సరే అన్న చక్రి
ఆ తర్వాత ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలని కేశవ అంటాడు. చక్రి కూడా సరే అంటాడు. నిశ్చితార్థాన్నే ఆపేస్తే ఇక పెళ్లి ప్రసక్తే ఉండదు కదా అంటాడు. కానీ ఇంత వరకూ వచ్చిన తర్వాత పెద్ది వెనుకడుగు వేస్తాడా అని మహా అంటుంది.
అటు నారాయణ కూడా ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచించి మాధవ నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి ఒప్పుకోడు అని చెబుతాడు. కానీ చక్రి, కేశవ మాత్రం వినరు. మాధవ వినడు కాబట్టే అటు నుంచి నరుక్కొద్దాం.. నా దగ్గర ప్లాన్ ఉంది.. కానీ అదంతా పూర్తయ్యే వరకు ఈ విషయం ఎవరూ బయటకు చెప్పొద్దు.. ఆ ప్లాన్ ఏంటో చెప్పను.. చేసి చూపిస్తాను అని చక్రి అంటాడు.
ఈ పెళ్లి ఇష్టం లేదన్న జయంతి తండ్రి.. వాదించిన శశిపాల్
మరోవైపు ఈ పెళ్లి ఇష్టం లేని జయంతి తండ్రి బయటకు వచ్చి ఆందోళన చెందుతుంటాడు. ఇంతలో శశిపాల్ వస్తాడు. ఏమైందని అడిగితే ఈ పెళ్లి వద్దు.. ఇప్పటికే పెళ్లయిన మీ అక్క మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు.
కానీ అక్కకు ఆ బావ నచ్చలేదు.. అందుకే ఈ బావను పెళ్లి చేసుకుంటోంది.. అందులో తప్పేముంది.. మీకు ఇష్టం లేకపోయినా సరే బయటకు మాత్రం కాస్త నవ్వుతూ ఉండండి.. లోపల అందరూ బంధువులు ఉన్నారు.. అంతా సిద్ధమైంది.. లోనికి రమ్మని చెబుతాడు. కానీ జయంతి తండ్రి మాత్రం ఆలోచనలో పడతాడు.
జయంతి తండ్రికి చక్రి ఫోన్.. మాధవ దుర్మార్గుడంటూ..
అప్పుడే ఆయనకు చక్రి ఫోన్ చేస్తాడు. గొంతు మార్చి మాట్లాడతాడు. మీ అమ్మాయి గొంతు కోస్తున్నారా.. అసలు పెళ్లి చేసే ముందు ఆ అబ్బాయి ముందు, వెనుక తెలుసుకోరా.. ఆ మాధవ పెద్ద దుర్మార్గుడు.. తాగుబోతు, తిరుగుబోతు.. పట్టపగలు తాగుతాడు.. ఆ అబ్బాయి తండ్రి మరీ పెద్ద తాగుబోతు.. వాళ్ల తమ్ముడు తిరుగుబోతు, బుల్లి తమ్ముడు కూడా అలాంటివాడే.. మొత్తంగా ఆ ఫ్యామిలీయే ఓ మోసాల ఫ్యామిలీ అంటూ ఇష్టం వచ్చినట్లు చెబుతాడు. మాధవ గురించి అంత దారుణంగా మాట్లాడటం చూసి మహా వద్దని వారించినా.. పెళ్లి రద్దవ్వాలంటే ఇది తప్పదు అని చక్రి చెబుతూ వెళ్తుంటాడు. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను.. వెంటనే రద్దు చేసుకోండి అని ఫోన్ పెట్టేస్తుంటాడు.
పెళ్లి వద్దన్న తండ్రి.. ఇది మాజీ భర్త పనేనన్న జయంతి
దీంతో జయంతి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు తండ్రి. ఈ నిశ్చితార్థం రద్దు చేసుకో.. ఆ అబ్బాయి అస్సలు మంచివాడు కాదట.. తాగుబోతు, తిరుగుబోతు అట.. వాళ్ల ఫ్యామిలీ కూడా మంచిది కాదట అని అంటాడు. పెళ్లి ఇష్టం లేక ఇలాంటి కథ అల్లుతున్నావా అని శశిపాల్ తండ్రిని నిలదీస్తాడు. నువ్వు చూశావా అని జయంతి అడుగుతుంది.
నేను చూడలేదు కానీ చూసిన వాళ్లు ఫోన్ చేసి చెప్పారు.. పైగా వాళ్లు గిట్టని వాళ్లు కూడా కాదు.. మన శ్రేయభిలాషులే అట అని తండ్రి అంటాడు. కానీ జయంతి మాత్రం ఇదంతా తన మాజీ భర్త శేఖర్ పనే అని అనుమానిస్తుంది. మీ పురాతన బావ ఎక్కడ అని శశిపాల్ ను అడిగితే.. బయట కూర్చొని అందరికీ ఏదేదో చెబుతున్నాడని అంటాడు. చూశారా.. అతని కంటే ముందు నా పెళ్లి జరగడం చూడలేక ఇలాంటివి చేస్తున్నాడు.. మీరు పట్టించుకోవద్దు అని అంటూ జయంతి నిశ్చితార్థానికి రెడీ అవుతుంది.
తాయారుని రంగంలోకి దించిన నారాయణ
ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవడంతో ఇక లాభం లేదనుకొని తాయారుని రంగంలోకి దించుతాడు నారాయణ. జయంతి తల్లితో పోట్లాడిస్తే ఈ నిశ్చితార్థం రద్దవుతుంది కదా అనుకొని ఆమె దగ్గరికి వెళ్లి నీ గురించి ఆమె ఏదేదో మాట్లాడుతోందని రెచ్చగొడతాడు. దీంతో తాయారు ఆమె దగ్గరికి ఫైట్ చేయడానికి వెళ్తుంటే గాయత్రి అడ్డుపడుతుంది. ఇలా ఎందుకు చేశారని చక్రి, మహా, నారాయణను నిలదీస్తుంది. ఈ నిశ్చితార్థం రద్దు చేయడానికే ఇలా చేశామని వాళ్లు చెప్పడంతో ఆమె షాకవుతుంది. అంతటితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


