పెద్ది మూవీ కోసం కండలు పెంచుతున్న రామ్ చరణ్.. లుక్ అదిరిపోయిందిగా.. ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కొత్త సినిమా కోసం కష్టపడుతున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పెద్ది మూవీ కోసం కండలు పెంచుతున్నారు. తన కొత్త లుక్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు చరణ్. ఆ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. పెద్ది మూవీలోని రా అండ్ రస్టిక్ లుక్ కోసం కండలు పెంచేస్తున్నారు. స్టోరీకి తగ్గట్లుగా బాడీ షేప్ ను ఛేంజ్ చేస్తున్నారు. జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. కండలు తిరిగిన బాడీతో, చెమటలు కక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రామ్ చరణ్. ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

ఫొటో వైరల్
పెద్ది సినిమా కోసం లుక్ ను మార్చేందుకు కష్టపడుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటో వైరల్ గా మారింది. సోమవారం (జులై 21) ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ పోస్టు చేసిన పిక్ అదిరిపోయింది. సైడ్ లుక్ లో కండలను చూపిస్తున్నాడీ మెగా హీరో. ‘‘పెద్ది మూవీ కోసం మారే ప్రక్రియ మొదలైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం’’ అని క్యాప్షన్ ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్ ల మీద లైక్ లు కొట్టేస్తున్నారు. కామెంట్లతో నింపేస్తున్నారు.
హిట్ కొట్టాలని
2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. కానీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. తండ్రిచిరంజీవితో కలిసి ఆచార్య చేశారు. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. ఇక భారీ హైప్ తో శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. అందుకే ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు రామ్ చరణ్.
మాస్ క్యారెక్టర్
2018లో రంగస్థలం మూవీలో రూరల్ విలేజ్ స్టోరీలో మాస్ క్యారెక్టర్ లో కనిపించారు రామ్ చరణ్. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన డైరెక్షన్ లో వస్తున్న పెద్ది సినిమా కోసం మరోసారి అలాంటి అవతారమే ఎత్తనున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్ అంటూ వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. గ్రామంలో క్రికెట్ చుట్టూ తిరిగే కథ అని గ్లింప్స్ తో అర్థమైంది. ముఖ్యంగా అందులో రామ్ చరణ్ ఓ షాట్ కొట్టే సీన్ తెగ వైరలైంది.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని 2026 మార్చి 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.














