ఈరోజు నుంచే స్టార్ మాలో సరికొత్త సీరియల్.. టైమ్ ఇదే.. లాంచ్ ఎపిసోడ్ మిస్ కావద్దు
స్టార్ మా సరికొత్త సీరియల్ ను ప్రారంభిస్తోంది. సోమవారం (జులై 7) నుంచే ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. ప్రముఖ సీరియల్ బ్రహ్మముడి మేకర్స్ నుంచే ఈ కొత్త సీరియల్ కూడా వస్తుండటం విశేషం. మరి ఆ సీరియల్ విశేషాలేంటో చూడండి.
తెలుగు టీవీ సీరియల్స్ విషయంలో స్టార్ మా ఛానెల్ కొన్నాళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాంటి ఛానెల్ నుంచి కొత్త సీరియల్ వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పుడా ఛానెల్ నుంచి నిండు మనసులు అనే కొత్త సీరియల్ రాబోతోంది. సోమవారం (జులై 7) నుంచే ప్రారంభం కానుంది.

నిండు మనసులు సీరియల్
స్టార్ మా ఛానెల్లో సరికొత్త సీరియల్ నిండు మనసులు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది. కొన్ని నెలల కిందటే ఈ సీరియల్ విషయాన్ని స్టార్ మా తెలిపింది. తాజాగా లాంచ్ ఎపిసోడ్ గురించి సోమవారం (జులై 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ఇరువురి దారులు వేరైనా.. మనసులు కలిసే చోటే చివరి మజిలీ.. లాంచ్ ఎపిసోడ్ మిస్ కావద్దు.. ఈరోజే స్టార్ మాలో” అనే క్యాప్షన్ తో స్టార్ మా ట్వీట్ చేసింది. ముందు రోజు ఓ ప్రోమోను కూడా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. అందులో ఈ సీరియల్లో లీడ్ రోల్ ప్రేరణను పరిచయం చేసింది. ఐఏఎస్ కావాలని కలలు కనే పాత్ర ఆమెది. తన ఇల్లు, తండ్రి, చదుకోవడం అంటే తనకు చాలా ఇష్టమంటూ ఆమె పాత్ర తనను తాను పరిచయం చేసుకుంది.
నిండు మనసులు సీరియల్ గురించి..
స్టార్ మాలో వస్తున్న ప్రముఖ సీరియల్ బ్రహ్మముడి మేకర్స్ నుంచి ఈ నిండు మనసులు వస్తోంది. బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ పంతం.. ఈ సీరియల్కు దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రహ్మముడితో పాటు గుప్పెడంత మనసు సీరియల్స్ను ప్రొడ్యూస్ చేసిన భూమి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిండు మనసులును నిర్మిస్తోంది.
నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పవిత్రా బీ నాయక్ నిండు మనుసులు సీరియల్లో లీడ్ రోల్లో కనిపించబోతోంది. నువ్వు నేను ప్రేమలో పద్మావతి పాత్ర ద్వారా తెలుగు సీరియల్ లవర్స్ను మెప్పించిందామె. అమాయకత్వం, ధైర్యం కలబోసిన గృహిణి పాత్రలో నాచురల్ యాక్టింగ్తో మెప్పించింది.
నిండు మనుసులు సీరియల్లో ఇంద్రనీల్, నీప, సంగీత కొండెపూడి కీలక పాత్రలు పోషించారు. సంగీత కొండెపూడి గుప్పెడంత మనసులో దేవయానిగా నటించగా.. నీప బ్రహ్మముడి సీరియల్లో కనకం పాత్ర పోషిస్తోంది. నిజానికి ఇది గుప్పెడెంత మనసు సీక్వెల్ అంటూ ప్రచారం జరిగినా.. తర్వాత కాదని తేలింది.
నువ్వు నేను ప్రేమ తర్వాత స్టార్ మాలో పవిత్రా బీ నాయక్ చేస్తోన్న సెకండ్ సీరియల్ ఇది. నువ్వు నేను ప్రేమ గతేడాది నవంబర్లో ముగిసింది. మరి ఇప్పుడు నిండు మనసులు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమెను ప్రేక్షకుల అదే స్థాయిలో ఆదరిస్తారేమో చూడాలి. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారం కానుంది.

E-Paper












