నవరాత్రి 2025: తొమ్మిది రంగులు, విశిష్టత, పూజించాల్సిన దేవతల పూర్తి వివరాలు

Navratri 2025 Colours: ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని నవదుర్గల రూపంలో పూజిస్తారు. ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన రంగు, ఒక దేవతకు అంకితం. ఆ తొమ్మిది రోజులు పూజించాల్సిన దేవతలు, వాటికి సంబంధించిన రంగులు, ప్రాముఖ్యత తెలుసుకుందాం.

Published on: Sep 22, 2025 9:51 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై, అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. చివరి రోజున విజయదశమి లేదా దసరాను జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల పండుగలో భాగంగా నవదుర్గలుగా కొలిచే దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

తొమ్మిది రోజులు దుర్గాదేవిని నవదుర్గల రూపంలో పూజిస్తారు
తొమ్మిది రోజులు దుర్గాదేవిని నవదుర్గల రూపంలో పూజిస్తారు

ఈ తొమ్మిది రూపాలు.. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన దేవతకు, ఒక శుభప్రదమైన రంగుకు అంకితం. ఆయా రంగుల దుస్తులు ధరించి పూజలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే, అసలు ఈ రంగులు దేనికి ప్రతీకలు, ఏ రోజు ఏ రంగు ధరించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నవరాత్రి 2025: తొమ్మిది రంగుల పూర్తి జాబితా

ధృక్ పంచాంగం ప్రకారం, నవరాత్రి తొమ్మిది రోజులు పూజించాల్సిన దేవతలు, ఆయా రోజులకు సంబంధించిన రంగుల వివరాలు ఇవీ.

నవరాత్రి 2025: ప్రతి రంగు ప్రాముఖ్యత

మొదటి రోజు: తెలుపు (శైలపుత్రి అమ్మవారు)

తెలుపు రంగు పవిత్రత, స్వచ్ఛతకు ప్రతీక. ఈ రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి మా శైలపుత్రిని పూజిస్తే, ఆ తల్లి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత, భద్రత లభిస్తాయి.

రెండో రోజు: ఎరుపు (బ్రహ్మచారిణి అమ్మవారు)

ఎరుపు రంగు అపారమైన శక్తి, ప్రేమ, ఉత్సాహానికి చిహ్నం. అందుకే అమ్మవారికి ఎరుపు రంగు చున్రీ (శాలువ) సమర్పిస్తారు. ఈ రోజున ఎరుపు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మూడో రోజు: నీలం (చంద్రఘంట అమ్మవారు)

నీలం రంగు సంపద, ప్రశాంతత, లోతైన అవగాహనను సూచిస్తుంది. వివాహిత రూపమైన మా చంద్రఘంటను ఆరాధించడానికి నీలం రంగు దుస్తులు ధరిస్తారు.

నాలుగో రోజు: పసుపు (కూష్మాండ అమ్మవారు)

పసుపు రంగు సానుకూల శక్తికి ప్రతీక. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంచుతుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా పసుపు రంగు దుస్తులు ధరిస్తే, అది సంతోషాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున కూష్మాండ దేవిని పూజిస్తారు. ఈమె తేజస్సు, శక్తికి ప్రతీక. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.

ఐదో రోజు: ఆకుపచ్చ (స్కందమాత అమ్మవారు)

ఆకుపచ్చ రంగు ప్రకృతికి, కొత్త ప్రారంభాలకు సూచిక. ఇది పెరుగుదల, సంతానోత్పత్తి, శాంతి, ప్రశాంతతను సూచిస్తుంది. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి స్కందమాతను పూజిస్తే, ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

ఆరో రోజు: బూడిద (కాత్యాయని అమ్మవారు)

బూడిద రంగు సమతుల్య భావాలను, నిరాడంబరతను సూచిస్తుంది. దుర్గాదేవి ఐదవ రూపమైన స్కందమాతకు బూడిద రంగు దుస్తులు ధరించి పూజలు చేయడం శుభప్రదం.

ఏడో రోజు: నారింజ (కాళరాత్రి అమ్మవారు)

నారింజ రంగు వెచ్చదనం, ఆనందాన్ని సూచిస్తుంది. సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ రోజున ఈ రంగు దుస్తులు ధరించి కాళరాత్రి దేవిని ఆరాధిస్తే, జీవితంలో సంతోషం, ఉత్సాహం నిండుతాయి.

ఎనిమిదో రోజు: నెమలి ఆకుపచ్చ (మహాగౌరి అమ్మవారు)

నెమలి ఆకుపచ్చ రంగు ప్రత్యేకత, వ్యక్తిత్వం, కరుణ, తాజాదనానికి ప్రతీక. ఈ రోజున మహాగౌరి దేవిని ఆరాధించడం వల్ల ఈ లక్షణాలు వృద్ధి చెందుతాయి.

తొమ్మిదో రోజు: పింక్ (సిద్ధిదాత్రి అమ్మవారు)

పింక్ రంగు విశ్వవ్యాప్త ప్రేమ, వాత్సల్యం, సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది ఆకర్షణీయమైన రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల కరుణ, అనుబంధం పెరుగుతాయి.

విజయదశమి (పదో రోజు): ఎరుపు, నారింజ

నవరాత్రుల చివరి రోజున, అంటే విజయదశమి రోజున ఎరుపు, నారింజ రంగులు ధరించడం శుభప్రదం. ఈ రెండు రంగులు శక్తి, ప్రేమ, ఉత్సాహం, సానుకూలతను సూచిస్తాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More