Vietnam Boat Accident : వియత్నాంలో ఘోర ప్రమాదం - 15 మంది దుర్మరణం, మృతుల్లో తెలుగు పర్యాటకులు
Vietnam Boat Capsize : వియత్నాంలో విషాదం చోటు చేసుకుంది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పర్యాటక పడవ మునిగిపోయిన ప్రమాదంలో భారతీయ పర్యాటకులతో సహా 15 మంది మరణించారు. పలువురు తెలుగు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.
Vietnam Boat Capsize : వియత్నాంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్బోట్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో భారతీయ పర్యాటకులతో సహా కనీసం 15 మంది మరణించినట్లు స్థానిక వియత్నాం మీడియా వెల్లడించింది.
స్థానిక న్యూస్ పోర్టల్ 'వీఎన్ ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్' తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాద సమయంలో స్పీడ్బోట్లో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా హాన్ మే రుట్ నుంచి అన్ థోయ్ పోర్టుకు ప్రయాణిస్తుండగా….. హాన్ మే రుట్ న్గోయ్ తీరానికి దాదాపు 400 మీటర్ల దూరంలో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే పడవలో ఉన్న వారంతా ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫు క్వాక్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అధికారులు, సరిహద్దు రక్షక దళాలు, నౌకాదళం, కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర పర్యాటక పడవలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు.
భారత రాయబార కార్యాలయం అలర్ట్…
ఈ ఘోర ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితులకు అవసరమైన సేవలు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు ఎంబసీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ప్రకటించింది. అయితే, మరణించిన వారి పూర్తి వివరాలను భారత రాయబార కార్యాలయం అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.
హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం, హనోయిలోని భారత రాయబార కార్యాలయాల్లో ఈ కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులు సమాచారం, సహాయం కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
- 84 36 281 7930
- 84 91 552 37 14
- 84 33 452 0414
బోటులో తెలుగు ప్రయాణికులు..!
ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వారిలో ఏపీ, తెలంగాణ నుంచి కూడా పలువురు ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీరు మూడు పడవల్లో సముద్రంలో విహార యాత్రకు వెళ్లారు. చనిపోయినవారిలో పలువురు తెలుగు వారు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

