ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా… జూలై 14తో గడువు ముగిసింది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13 నుంచే వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రావాల్సి ఉండేది. కానీ పలు కాలేజీలకు ప్రభుత్వ అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో తేదీలను మార్చినట్లు అధికారులు ప్రకటించారు.
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు…

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడగా నేటి (జూలై 16) నుంచి ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 21వ తేదీ వరకు కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూలై 22వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
జూలై 25న సీట్ల కేటాయింపు…
జూలై 25వ తేదీన ఐసెట్- 2025 సీట్లను కేటాయించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 26 నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు జూలై 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2025 నిర్వహించారు. మే 20 వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఆంధ్ర యూనివర్సిటీ చేపట్టింది.
మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహించారు. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ ఈ లింక్ లో తెలుసుకోవచ్చు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…. 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన సంగతి తెలిసిందే.