Ayodhya Donation Scam: అయోధ్య రామ్ మందిర్ విరాళాల గోల్మాల్.. ఎఫ్ఐఆర్ నమోదు.. యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం
Ayodhya Donation Scam: అయోధ్య రామ మందిర విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
Ayodhya Donation Scam: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగం ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రామాలయానికి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల ఫండ్స్ గోల్మాల్ అయ్యాయనే ఆరోపణలపై అధికారికంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా అయోధ్య పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ జరుపుతున్న టైమ్లోనే ఈ లీగల్ యాక్షన్ మొదలు కావడం రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్గా మారింది.
అసలు ఈ వివాదం ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది?
ఈ నెల ప్రారంభంలోనే రామ్ మందిర్ విరాళాలు దుర్వినియోగం అయ్యాయంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెంటనే సిట్ ని రంగంలోకి దించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IG) కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్ లాంటి అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్లో సభ్యులుగా ఉండి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అయోధ్య రామాలయం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తులు భారీగా నగదు, బంగారు, వెండి కానుకలను విరాళాల రూపంలో సమర్పించారు. అయితే ఈ విరాళాల నిర్వహణలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తొలిసారి మీడియా ముందు ఓపెన్ అయ్యారు. ఆలయ ట్రస్ట్ అకౌంట్స్ నుంచి దాదాపు రూ.7 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు డబ్బు మాయమైందని ఆయన ఆరోపించడంతో ప్రతిపక్ష నేతలంతా గళమెత్తారు.
ఈ విరాళాల నిర్వహణపై ప్రజల్లో అనుమానాలు మొదలవడంతో జూన్ 12న అడ్వకేట్ మోహిత్ అశోక్ అలహాబాద్ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) ఫైల్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కూడా ఒక పిటిషన్ నమోదైంది. సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా మారే ఛాన్స్ ఉందని, అందుకే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తో పూర్తి విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. విశ్వహిందూ పరిషత్ (VHP) కూడా ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాముడి పాదుకలు, నగలు కూడా దొంగిలించారు: అరవింద్ కేజ్రీవాల్
ఈ విరాళాల కుంభకోణం వివాదంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేవలం డబ్బు మాత్రమే కాకుండా దేవుడికి సంబంధించిన అత్యంత పవిత్రమైన వస్తువులను కూడా దొంగిలించారంటూ ఆయన మండిపడ్డారు.
"పాపాత్ములు శ్రీరాముడి పాదుకలను కూడా వదల్లేదు. స్వామివారి పూలమాలలు, బంగారు ఆభరణాలు, దీపాలను కూడా దొంగిలించారు. భక్తులు దేవుడికి సమర్పించిన వజ్రాలు, నవరత్నాలు మాయమయ్యాయి. దాదాపు రూ.200 కోట్ల నగదుతో పాటు 200 కిలోల వెండిని కూడా నొక్కేశారు. ఈ విషయం తెలిసి నా మనసు తీవ్రంగా గాయపడింది" అని కేజ్రీవాల్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
తాను స్వయంగా అయోధ్య వెళ్లి రామ్ లల్లాను, హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న సాధు సంతులతో ఈ విషయంపై మాట్లాడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న సిట్ టీమ్కు ఎలాంటి న్యాయపరమైన గుర్తింపు లేదని, ఇది కేవలం కేసును ముగించడానికి వేసిన కమిటీ అని ఆయన కొట్టిపారేశారు.
మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే లక్నోలో సిట్ అధికారుల ముందు హాజరై తన దగ్గర ఉన్న కీలక ఆధారాలు, డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విరాళాల లొసుగులపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


