ఈ ఒక్క కారిడర్తో 40శాతం ట్రాఫిక్ కట్! బెంగళూరు ప్రజల కష్టాలు తీరినట్టే..
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్! మహా నగరంలో 'బెంగళూరు బిజినెస్ కారిడార్'కు గ్రీన్ సిగ్నల్ పడింది. 117 కిమీ రింగ్ రోడ్డుతో ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరు పేరు వినగానే ఐటీ హబ్తో పాటు మరొక విషయం గుర్తొస్తుంది. అదే ట్రాఫిక్! బెంగళూరు ట్రాఫిక్పై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ను తగ్గించుకోవడానికి ఇప్పుడు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 117 కిలోమీటర్ల పెరిఫెరల్ రింగ్ రోడ్డు (పీఆర్ఆర్) ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికి కొత్త పేరును ఖరారు చేశారు— అదే 'బెంగళూరు బిజినెస్ కారిడార్'. ఈ ప్రాజెక్టును బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) పర్యవేక్షిస్తుంది. దీనిని కేవలం రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చారిత్రక నిర్ణయం: ట్రాఫిక్ 40% తగ్గుతుందని అంచనా..
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ను తగ్గించడానికి ఇది "చారిత్రక నిర్ణయం" అవుతుందని చెప్పారు.
"బెంగళూరు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ట్రాఫిక్ తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 1,900 కుటుంబాలు ప్రభావితమవుతాయని నాకు తెలుసు. అయితే, వారికి ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందిస్తోంది. ఇది కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి," అని ఆయన పేర్కొన్నారు.
ఈ కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగరంలోని ట్రాఫిక్ 40 శాతం వరకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి కారణం.. వివిధ హైవేలు, పారిశ్రామిక జోన్ల మధ్య ప్రయాణించే వాహనాలు నగర ప్రధాన ప్రాంతాన్ని తప్పించుకొని బయటి నుంచే వెళ్లగలుగుతాయి.
"కొంతమంది భూ యజమానులు భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తే, వారికి చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసి పనులు కొనసాగిస్తాం. ఏ ధరకైనా భూమిని డి-నోటిఫై చేయబోము," అని శివకుమార్ స్పష్టం చేశారు.
భూసేకరణకు కొత్త పరిహారం ప్యాకేజీ: ఐదు ఆప్షన్లు..
వాస్తవానికి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 27,000 కోట్లుగా ఉంది. అయితే, ఎక్కువ మంది రైతులు నగదు రూపంలో కాకుండా భూమికి బదులుగా భూమిని ఎంచుకోవడంతో ప్రాజెక్టు వ్యయం రూ. 10,000 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు.
భూసేకరణకు సంబంధించిన పాత వివాదాలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం భూములు కోల్పోతున్న రైతులు, యజమానుల కోసం ఐదు ఆప్షన్లతో కూడిన కొత్త పరిహార ప్యాకేజీని ప్రకటించింది:
నగదు పరిహారం: అక్టోబర్ 2023 రేట్ల ఆధారంగా, పట్టణ ప్రాంతాల్లో గైడెన్స్ విలువకు రెట్టింపు, నగర పరిమితికి 5 కిమీలోపు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు నగదు పరిహారం.
టీడీఆర్: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) నిబంధనల ప్రకారం, గైడెన్స్ విలువకు రెట్టింపు సమానమైన అభివృద్ధి హక్కుల బదిలీ.
అదనపు ఎఫ్ఏఆర్ (ఫ్లోర్ ఏరియా రేషియో): ప్రాజెక్టు మార్గంలో మిగిలిన భూమిపై ఉపయోగించుకోవడానికి అదనపు ఫ్లోర్ ఏరియా నిష్పత్తి సౌకర్యం.
అభివృద్ధి చేసిన ప్లాట్లు: నివాస ప్రాంతాల్లో అర ఎకరం కంటే ఎక్కువ భూమిని కోల్పోయిన వారికి, ప్రభుత్వం సమీప లేఅవుట్లలో 40 శాతం అభివృద్ధి చేసిన భూమిని అందిస్తుంది.
వాణిజ్య భూముల పరిహారం: అభివృద్ధి చేసిన వాణిజ్య భూమిని కోల్పోయిన వారికి, ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న 35 మీటర్ల వాణిజ్య కారిడార్లో 35 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయిస్తారు. చిన్న భూ యజమానులు దీనికి బదులుగా నగదును స్వీకరించవచ్చు.
అధికారుల అభిప్రాయం ప్రకారం.. ఈ బెంగళూరు బిజినెస్ కారిడార్ కేవలం ట్రాఫిక్ ఉపశమనం మాత్రమే కాకుండా, పెద్ద మొత్తంలో భూమిని వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులోకి తీసుకువస్తుంది. తద్వారా బెంగళూరును ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా మారుస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


