Crime news : పెళ్లి విందులో రచ్చ రచ్చ- మటన్ బదులు చికెన్ పెట్టినందుకు! 12మందికి..

Bihar wedding fight : పెళ్లి వేడుకలో విందు భోజనం చిచ్చు రేపింది. మటన్ వడ్డిస్తామని చెప్పి చికెన్ వడ్డించారనే కోపంతో వధూవరుల బంధువులు కత్తులు, కర్రలతో దాడులకు దిగడంతో డజను మంది ఆసుపత్రి పాలయ్యారు.

Published on: Jul 11, 2026, 09:58:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు.. విందు భోజనాల్లో చిన్నపాటి లోపాలు జరిగినా ఇరువర్గాల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది! కొన్నిచోట్ల ఐస్‌క్రీమ్ దొరకలేదని, మరికొన్నిచోట్ల రసం సరిగ్గా లేదని అలిగి పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే బీహార్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో మాత్రం విందు భోజనం ఏకంగా రణరంగాన్ని తలపించింది! భోజనంలో మటన్ పెడతామని హామీ ఇచ్చి చికెన్ వడ్డించడంతో కోపంతో ఊగిపోయిన బంధువులు.. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.

పెళ్లి విందులో గొడవ- వీడియో వైరల్..
పెళ్లి విందులో గొడవ- వీడియో వైరల్..

మటన్ లేదు.. చికెన్ తింటారా?

ఈ వింత సంఘటన బీహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్‌పూర్ పట్టణంలో వెలుగు చూసింది. మహ్మద్ అన్వర్ కుమారుడైన మహ్మద్ అబ్దుల్లా అలియాస్ చాంద్‌కు, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జావేద్ అలియాస్ మోటో కుమార్తెకు గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వివాహం (నికా) జరిగింది. పెళ్లి తంతు ముగిసేవరకు ఇరు కుటుంబాల మధ్య వాతావరణం చాలా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా సాగింది. అసలు గొడవంతా ఆ తర్వాతే మొదలైంది.

పెళ్లి వేడుక ముగిసిన వెంటనే వరుడి తరపు బంధువులు, స్నేహితులు కలిసి విందు భోజనానికి కూర్చున్నారు. పెళ్లి కూతురు తరపు వారు తమకు విందులో ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ లేదా మటన్ కూర వడ్డిస్తారని (ముందే వాగ్దానం చేసినందుకు) ఎదురుచూశారు. కానీ, తీరా ప్లేట్లు ముందుకొచ్చాక చూస్తే అందులో మటన్‌కు బదులుగా చికెన్ వంటకాలు కనిపించాయి.

దీనిపై వరుడి తరపు వారు వధూవరుల కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీశారు. ఇచ్చిన మాట తప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం, ఇరుపక్షాల అహం దెబ్బతినడంతో క్షణాల వ్యవధిలో తీవ్ర ఘర్షణకు దారితీసింది.

కత్తులు, కర్రలతో విరుచుకుపడ్డ బంధువులు!

విందు హాల్ కాస్తా యుద్ధభూమిగా మారిపోయింది. వధూవరుల తరపు బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అంతటితో ఆగకుండా, కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద కర్రలతో అతిథులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక వీడియో క్లిప్‌లో కొందరు వ్యక్తులు కత్తులు తిప్పుతూ, పెళ్లికొచ్చిన జనాలను భయభ్రాంతులకు గురిచేయడం స్పష్టంగా కనిపిస్తోంది.

"భోజనాల దగ్గర చిన్న వివాదమే కదా అని సర్దుకుపోయే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. పెళ్లికూతురు తరపు వారు మా బారాతీలను దారుణంగా కొట్టారు," అని వరుడి బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి పోలీస్ ఫోర్స్.. దర్యాప్తు ప్రారంభం!

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమారు 12 మందిని స్థానికులు వెంటనే సిమ్రి బక్తియార్‌పూర్‌లోని సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియో ఆధారంగా కత్తులు, కర్రలతో దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

ఒక్క మటన్ కూర కోసం పెళ్లి పీటల మీద జరగాల్సిన వేడుక కాస్తా.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. ఈ కథ విన్న వారందరు షాక్ అవుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More