సైక్లోన్ ‘దిత్వా’: తమిళనాడు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం 'దిత్వా'గా బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో వాతావరణం మారిపోయింది. 'సెన్యార్' తుఫాను అవశేషంగా భావిస్తున్న వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతోంది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం (Deep Depression) గురువారం నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

గత 6 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని బట్టికలోవాకు ఆగ్నేయంగా 120 కి.మీ, హంబన్ టోటాకు తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, భారతదేశంలోని పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 640 కి.మీ, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఐఎండీ హెచ్చరికలు ఇలా:
"రానున్న 3 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం మీదుగా ఉత్తర-వాయువ్య దిశగా పయనించి, మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 48 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ఉత్తర-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది" అని ఐఎండీ హెచ్చరించింది.
సుమిత్రా తీరంలో మరో వాయుగుండం:
మలక్కా జలసంధి మీదుగా ఉన్న 'సెన్యార్' తుఫాను అవశేషంగా భావిస్తున్న మరో తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో దాదాపు తూర్పు వైపు కదిలింది. ఇది జార్జ్ టౌన్ (మలేషియా)కు దక్షిణ-నైరుతిగా 200 కి.మీ, కూట మక్మూర్ (ఇండోనేషియా)కు తూర్పు-ఆగ్నేయంగా 320 కి.మీ, నాన్కౌరీ (నికోబార్ దీవులు)కు ఆగ్నేయంగా 820 కి.మీ, కార్ నికోబార్ (నికోబార్ దీవులు)కు ఆగ్నేయంగా 960 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది దాదాపు తూర్పు దిశగా పయనించి, రాబోయే 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సునామీ హెచ్చరిక ఉపసంహరణ
సుమిత్రా తీరంలో సంభవించిన 6.3 తీవ్రత గల భూకంపం కారణంగా అండమాన్ నికోబార్ ప్రాంతంలోని రెండు ప్రాంతాలకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఉదయం 10.51 గంటలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. అయితే, ఉదయం 11.17 గంటలకు విడుదల చేసిన బులెటిన్లో, భారత తీర ప్రాంతానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


