PF withdrawal : ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు- ఎంత విత్డ్రా చేసుకోవచ్చు?
భారతదేశంలోని కోట్ల మంది ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ తన సేవలను 'ఉమాంగ్' యాప్ ద్వారా అప్గ్రేడ్ చేస్తోంది. వీటిల్లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్స్టంట్ విత్డ్రాయల్. వీటి నుంచి ఎంత విత్డ్రా చేసుకోవచ్చు? ఇక్కడ తెలుసుకోండి..
పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ఈ నూతన వ్యవస్థలో భాగంగా చందాదారులు తమ పీఎఫ్ నిధులను ఏటీఎం కార్డులు లేదా యూపీఐ యాప్ల ద్వారా నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. 2026 మధ్య నాటికి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

అయితే ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ అమౌంట్ ఎంత వరకు విత్డ్రా చేసుకోవచ్చు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు- ఎంత విత్డ్రా చేసుకోవచ్చు?
విత్డ్రాయల్ పరిమితులపై ప్రస్తుతానికి వివిధ ప్రతిపాదనలు ఉన్నాయి:
పరిమితి: మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 50% నుంచి 75% వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండవచ్చు. గత ఏడాది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. మార్చి 2026 లోపు ఏటీఎం ద్వారా విత్డ్రాయల్ సదుపాయం వస్తుందని, 75% వరకు నిధులను తీసుకోవచ్చని పేర్కొన్నారు.
యూపీఐ క్యాప్: యూపీఐ ద్వారా చేసే ఒక్కో లావాదేవీకి సుమారు రూ. 25,000 పరిమితి విధించే అవకాశం ఉంది.
అయితే, ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ఈ పరిమితులపై స్పష్టత వస్తుంది.
ఏటీఎం కార్డులు, బ్యాంకుల ఒప్పందం..
పీఎఫ్ ఖాతాలకు అనుసంధానించిన ప్రత్యేక ఏటీఎం కార్డులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 32 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రధాన బ్యాంకులు: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ మొదలైనవి.
ఇతర బ్యాంకులు: ఇండస్ఇండ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ వంటి మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు..
ఈ సదుపాయాన్ని పొందాలంటే సభ్యులకు ఈ కిందివి తప్పనిసరి:
- యాక్టివ్ యూఏఎన్ (Universal Account Number) ఉండాలి, దానికి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
- ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి కేవైసీ వివరాలు వెరిఫై అయి ఉండాలి.
ఆటో-సెటిల్మెంట్ ప్రక్రియ..
ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కావడానికి మాన్యువల్ ప్రాసెసింగ్ వల్ల సమయం పడుతోంది. కొత్త వ్యవస్థలో ఎలక్ట్రానిక్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి మాన్యువల్ జోక్యం లేకుండా 3 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.
ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. దీనివల్ల ప్రతి ఏటా వచ్చే 5 కోట్ల క్లెయిమ్ల ప్రాసెసింగ్ వేగవంతం కానుంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఆటో-సెటిల్మెంట్ కింద గరిష్టంగా ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు?
కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, దీనివల్ల మాన్యువల్ అప్రూవల్ లేకుండానే వేగంగా నగదు అందుతుంది.
2. పీఎఫ్ ఏటీఎం కార్డు/యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవడానికి సర్వీస్ ఛార్జీలు ఉంటాయా?
ప్రస్తుతానికి ప్రభుత్వం ఛార్జీల గురించి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఇది సాధారణ బ్యాంక్ లావాదేవీల మాదిరిగానే పనిచేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించినప్పుడు వర్తించే ప్రామాణిక ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. నిధుల ఉపసంహరణను ప్రోత్సహించడానికి ప్రారంభంలో కొన్ని ఉచిత లావాదేవీలను ప్రభుత్వం అనుమతించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


