నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ అయితే.. నేను గొప్ప ఆల్ రౌండర్: మాజీ క్రికెటర్ చురకలు

టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని ఓ ఆల్ రౌండర్ గా ఎంపిక చేయడంపై అతడు విమర్శలు గుప్పించాడు. అతడు ఆల్ రౌండర్ అయితే తాను గొప్ప ఆల్ రౌండర్ అంటూ చురకలు అంటించాడు.

Published on: Nov 25, 2025, 15:45:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి భారత సెలక్షన్ పాలసీలపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈసారి అతడు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాడు. నితీష్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడాన్ని ప్రశ్నించడమే కాకుండా, అతను అంతర్జాతీయ స్థాయిలో ఆల్‌రౌండర్ అనే భావనను కొట్టిపారేశాడు.

నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ అయితే.. నేను గొప్ప ఆల్ రౌండర్: మాజీ క్రికెటర్ చురకలు (PTI)
నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ అయితే.. నేను గొప్ప ఆల్ రౌండర్: మాజీ క్రికెటర్ చురకలు (PTI)

తన యూట్యూబ్ షో ‘చీకీ చీకా’లో తన కుమారుడు అనిరుద్ధతో కలిసి మాట్లాడిన శ్రీకాంత్.. టీమ్ బ్యాలెన్స్ గురించి చర్చ వచ్చినప్పుడు నితీష్ పేరు ప్రస్తావనకు రావడంతో తీవ్రంగా స్పందించాడు.

నితీష్ రెడ్డిపై శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు

"నితీష్ రెడ్డిని ఆల్‌రౌండర్ అని ఎవరు అంటున్నారు?" అంటూ శ్రీకాంత్ తనదైన శైలిలో సూటిగా ప్రశ్నించాడు. "అతని బౌలింగ్‌ను చూసి ఎవరైనా ఆల్‌రౌండర్ అని చెప్పగలరా? మెల్‌బోర్న్‌లో అతను సెంచరీ కొట్టాడు, అది నిజం.. కానీ ఆ తర్వాత అతను ఏం చేశాడు? ఒక కోయిల వచ్చినంత మాత్రాన వేసవి వచ్చినట్లు కాదు" అని విమర్శించాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నితీష్ చేసిన సెంచరీ అతని అత్యుత్తమ టెస్ట్ ప్రదర్శనగా నిలిచింది. అయితే ఆ ఇన్నింగ్స్ తర్వాత 22 ఏళ్ల నితీష్ బ్యాట్‌తో లేదా బంతితో ఎక్కడా రాణించలేదని, జాతీయ జట్టులో స్థానానికి అర్హత లేదని శ్రీకాంత్ వాదించాడు. "నితీష్ రెడ్డి ఆల్‌రౌండర్ అయితే నేను కూడా గ్రేట్ ఆల్‌రౌండర్‌నే" అని అతడు చురకలు అంటించడం గమనార్హం.

అలా ఎలా పిలుస్తారు?

"నిజాన్ని నిశితంగా మాట్లాడదాం. అతడు వేసే బంతుల్లో పేస్ ఉందా? మూవ్‌మెంట్ ఉందా? అతను అటాకింగ్ బ్యాటరా? అతన్ని మీరు ఆల్‌రౌండర్ అని ఎలా పిలుస్తారు?" అని శ్రీకాంత్ ప్రశ్నించాడు.

ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో సెంచరీ మినహా నితీష్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా చెప్పుకోదగిన ప్రదర్శన లేదు. 10 టెస్ట్ మ్యాచ్‌లలో అతని బ్యాటింగ్ సగటు కేవలం 28 కాగా మొత్తం వికెట్లు 8 మాత్రమే. రెండో టెస్టులో 10 పరుగులకే అవుట్ అయిన నితీష్, రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి వేసిన 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేదు.

నితీష్ టెస్ట్ జట్టులో మాత్రమే కాకుండా, వన్డే జట్టులో కూడా ఉండటాన్ని శ్రీకాంత్ ప్రశ్నించాడు. "నితీష్ వన్డే జట్టులో కూడా ఎలా ఉన్నాడు? అతను ఏం చేశాడు? అతను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉన్నాడా? అక్షర్ పటేల్‌ను ఎందుకు తీసుకోవడం లేదు?" అని సెలెక్టర్లను ప్రశ్నించాడు.

సెలక్షన్ పాలసీపై విమర్శలు

మాజీ సెలెక్టర్ శ్రీకాంత్ తన విమర్శలను మరింత విస్తృతం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించడాన్ని అతడు తప్పుబట్టాడు. అలాగే దేశీయ పరిస్థితులలో స్థిరమైన ప్రదర్శన చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నించాడు.

ఇదే సమయంలో రెండవ టెస్టులో భారత బౌలర్లతో ఆటాడుకున్న సౌతాఫ్రికా లోయర్-ఆర్డర్ హీరోలు మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామిలను శ్రీకాంత్ ప్రశంసించాడు. ముత్తుసామి క్రమశిక్షణ, అంకితభావం అద్భుతమని అభినందించాడు. ఈ సౌతాఫ్రికా జోడీ కారణంగా భారత బౌలింగ్ అటాక్ "చాలా సాధారణంగా" కనిపించిందని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More