Electric car : హ్యుందాయ్ కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు- టాటా పంచ్​కి పోటీగా! లాంచ్ ఎప్పుడంటే..

భారత ఈవీ మార్కెట్లో హ్యుందాయ్ సంచలనానికి సిద్ధమైంది. టాటా పంచ్ ఈవీకి సవాలు విసురుతూ తక్కువ ధరలో సరికొత్త మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త కారు ఫీచర్లు, సంస్థ విస్తరణ ప్రణాళికలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Sep 10, 2026, 14:15:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కస్టమర్ల ఆదరణ పొందుతున్న మైక్రో ఎస్‌యూవీ విభాగాన్ని చేజిక్కించుకునేందుకు దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ పక్కా వ్యూహంతో ముందుకు వస్తోంది! ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ సంస్థ ఒక సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త కారును త్వరలోనే విపణిలో ఆవిష్కరించనున్నట్లు హ్యుందాయ్ అధికారికంగా వెల్లడించింది.

హ్యుందాయ్ కొత్త ఈవీ..
హ్యుందాయ్ కొత్త ఈవీ..

ప్రస్తుతం భారత మార్కెట్లో ఐయోనిక్ 5, క్రెటా ఈవీ వంటి మోడళ్లతో ఆకట్టుకుంటున్న హ్యుందాయ్, ఈ కొత్త మోడల్‌తో సామాన్య కొనుగోలుదారులను సైతం ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ సిస్టర్ బ్రాండ్ కియా ఇండియాలో సైరోస్ ఈవీని ప్రవేశపెట్టింది. అదే బాటలో హ్యుందాయ్ సైతం తన కొత్త కారును రంగంలోకి దించుతోంది.

హ్యుందాయ్ కొత్త బడ్జెట్​ ఈవీ..

హ్యుందాయ్ సంస్థ అంతర్గతంగా 'HE1i' అనే కోడ్‌నేమ్‌తో ఈ సబ్-4 మీటర్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇది కియా సైరోస్ ఈవీతో ప్లాట్‌ఫామ్, ప్రధాన సాంకేతిక భాగాలను పంచుకోనుంది. గ్లోబల్ మార్కెట్లలో ఉన్న హ్యుందాయ్ 'ఇన్‌స్టర్' మోడల్ ఆధారంగా దీని డిజైన్ రూపుదిద్దుకుంటోంది.

2026 చివరి త్రైమాసికం నాటికి ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద ఉన్న హ్యుందాయ్ అత్యాధునిక తయారీ కేంద్రంలోనే ఈ కారును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేయనున్నారు. ‘ఈ-జీఎంపీ (కే)’ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా ఈ కొత్త ఈవీని నిర్మిస్తుండటం వల్ల మెరుగైన స్థలం, అత్యుత్తమ రేంజ్ లభించే అవకాశం ఉంది.

భారీగా డీలర్‌షిప్‌ల విస్తరణ.. సర్వీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందే దేశవ్యాప్తంగా తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను బలపరచడంపై హ్యుందాయ్ దృష్టి సారించింది. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు డీలర్‌షిప్ సిబ్బందికి ఈవీ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఈవీ సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను 820 టచ్‌పాయింట్లు, 650 వర్క్‌షాప్‌లకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అదనంగా 7,000 మందికి పైగా సేల్స్ ప్రతినిధులకు, 5,000 మందికి పైగా సర్వీస్ సిబ్బందికి ఈవీ నిర్వహణ, రిపేర్లపై శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే 10,000 మందికి పైగా సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, 2,600 మందికి పైగా సర్వీస్ టెక్నీషియన్లు కస్టమర్లకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని సంస్థ స్పష్టం చేసింది.

'సులభతరమైన విద్యుత్ ప్రయాణమే మా ధ్యేయం'

"మా ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్, ఈవీ-రెడీ సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్‌లను విస్తరించడంతో పాటు, డీలర్‌షిప్ బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగానికి మారే ప్రక్రియను వినియోగదారులకు మరింత సులభం, నమ్మకమైనదిగా చేయడమే మా ప్రధాన లక్ష్యం," అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గర్గ్ తెలిపారు.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో, అందుబాటు ధరలో రానున్న హ్యుందాయ్ మైక్రో ఈవీ సగటు వాహనదారుడికి మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More