ఆ 39వేల కార్లను రీకాల్​ చేసిన మారుతీ సుజుకీ..

మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాకు చెందిన 39,506 యూనిట్​లను సంస్థ రీకాల్​ చేసింది. ఫ్యూయెల్​ ఇండికేటర్​లో లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Nov 15, 2025, 06:00:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ తన ప్రముఖ ఎస్‌యూవీ మోడల్ అయిన గ్రాండ్ విటారాకు సంబంధించిన 39,506 యూనిట్​లను ‘రీకాల్​’ చేసింది! ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ఫ్యూయెల్​ లెవల్​ ఇండికేటర్​, వార్నింగ్ లైట్‌లో సమస్యలు ఉండవచ్చనే అనుమానంతో ఈ 39,506 మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీలను రీకాల్​ చేసినట్టు వివరించింది.

మారుతీ సుజుకీ సంస్థ లోగో.. (AFP)
మారుతీ సుజుకీ సంస్థ లోగో.. (AFP)

ఈ ప్రభావిత వాహనాలను 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

ఇంధన గేజ్‌లో లోపం ఏంటి?

మారుతీ సుజుకీ వివరాల ప్రకారం.. కొన్ని వాహనాల్లోని స్పీడోమీటర్ అసెంబ్లీలో ఉండే ఇంధన గేజ్, వార్నింగ్ లైట్ సరైన ఇంధన స్థాయిని చూపించడంలో విఫలం కావొచ్చు. ఈ సమస్య నిర్దిష్ట బ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైనప్పటికీ, వినియోగదారుల భద్రత, వాహన విశ్వసనీయత కోసం ముందు జాగ్రత్త చర్యగా 39వేలకుపైగా కార్లను రీకాల్‌ చేసినట్టు మారుతీ సుజుకీ తెలిపింది.

లోపం సరిదిద్దే విధానం..

ఈ లోపంతో ప్రభావితమైన వాహనాల యజమానులను మారుతీ సుజుకీ సంస్థకు చెందిన అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల సిబ్బంది నేరుగా సంప్రదిస్తారు. వినియోగదారులు తమ కార్లను తనిఖీ కోసం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రీకాల్‌లో భాగంగా, లోపభూయిష్ట భాగాన్ని ఉచితంగా పరిశీలించి, అవసరమైతే కొత్త దానితో భర్తీ చేస్తారు. అది కూడా ఉచితంగానే ఉంటుంది.

కంపెనీ నుంచి సమాచారం అందిన వెంటనే యజమానులు తక్షణమే స్పందించాలని, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా కార్లను తీసుకెళ్లాలని సంస్థ కోరింది.

గతంలోనూ రీకాల్స్..

2024 ప్రారంభంలో కూడా మారుతీ సుజుకీ తమ వ్యాగన్​ఆర్, బలెనో మోడల్స్‌కు సంబంధించి సుమారు 16,000 యూనిట్లను రీకాల్ చేసింది. ఇంజిన్ ఆగిపోయేందుకు కారణమయ్యే అవకాశం ఉన్న ఫ్యూయల్ పంప్ మోటార్‌లో లోపం ఉండవచ్చనే అనుమానంతో అప్పట్లో ఈ చర్య తీసుకున్నారు.

మారుతీ సుజుకీ మాత్రమే కాదు అనేక ఇతర ఆటోమొబైల్​ సంస్థల్లో సైతం ఈ రీకాల్స్​ ఇటీవలి కాలంలో పెరుగుతూనే ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More