Budget 2026 live : మూడు కర్తవ్యాలతో బడ్జెట్ : నిర్మలా సీతారామన్..
బడ్జెట్ 2026ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మూడు కర్తవ్యాలతో ఈసారి బడ్జెట్ని రూపొందించినట్టు వివరించారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలను వెల్లడించారు.
యావత్ భారత దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమె బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇది వరుసగా 9వ సారి. ఇదొక రికార్డు!

బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహాన్ని “మూడు కర్తవ్యాలు”గా ఆమె వివరించారు.
అవి..
ఆర్థిక వృద్ధికి ఊతం: పోటీతత్వాన్ని పెంచడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, దానిని స్థిరంగా కొనసాగించడం.
ప్రజల ఆకాంక్షల నెరవేర్పు: దేశ పౌరుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అవకాశాలను కల్పించడం.
అందరికీ వనరుల లభ్యత: ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతానికి అవసరమైన వనరులు, అవకాశాలు- సౌకర్యాలు సమానంగా అందేలా చూడటం.
ఈ మూడు లక్ష్యాల సాధనకు అనువైన పర్యావరణ వ్యవస్థ అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇది పూర్తిగా 'యువశక్తి' ఆధారిత బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు. సంస్కరణల పరంపర కొనసాగుతుందని చెబుతూ, దేశం ఇప్పుడు "రిఫార్మ్ ఎక్స్ప్రెస్" పట్టాలపై ప్రయాణిస్తోందని వ్యాఖ్యానించారు.
అట్టడుగు వర్గాలకు వృద్ధి ఫలాలు ఆర్థిక వృద్ధి ద్వారా వచ్చే ప్రయోజనాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా, ప్రతి రైతుకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, యువతకు చేరేలా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన 'సంకల్పం' అని ఆమె నొక్కి చెప్పారు. పేదలు, వెనుకబడిన వారు మరియు అణగారిన వర్గాల సంక్షేమమే పరమావధిగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలిపారు.
కీలక సంస్కరణల కొనసాగింపు గత ఏడాది కాలంలో జీఎస్టీ హేతుబద్ధీకరణ, కొత్త లేబర్ కోడ్లు, నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల వంటి అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశామని ఆమె గుర్తు చేశారు. ఈ సంస్కరణల వేగం తగ్గకుండా భవిష్యత్తులోనూ మరిన్ని మార్పులు ఉంటాయని ఆమె హామీ ఇచ్చారు.
ఆర్థిక సుస్థిరత కోసం ఆరు రంగాల్లో సంస్కరణలు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బయో ఫార్మా శక్తిలో భాగంగా 3 కొత్త ఫార్మా ఇన్స్టిట్యూషన్స్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అంతేకాదు, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రలో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కొత్త పథకాలను తీసుకొస్తున్నట్టు వివరించారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0..
నేటి టెక్ ప్రపంచంలో అత్యంత కీలక సెమీకండక్టర్ల తయారీ విషయంలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. “ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0”ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.40వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు. మిషన్లో భాగంగా రీసెర్చ్ సెంటర్లు, ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి..
అంతకుముందు నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కి వెళ్లి ద్రౌపది ముర్మును కలిశారు. ఆనవాయతీలో భాగంగా, అక్కడ ఆర్థికమంత్రికి రాష్ట్రపతి దహీ-చీని (పెరుగు- చెక్కెర)ని అందించారు. అనంతరం ఇరువురు కొంతసేపు బడ్జెట్లో ప్రతిపాదనల గురించి మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు బయలుదేరారు.
బడ్జెట్ చరిత్రలో 'నిర్మల' పర్వం..
వరుసగా 9వ సారి బడ్జెట్ను సమర్పించి సరికొత్త రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్.. ఈ మైలురాయిని గుర్తుచేసేలా అత్యంత హుందైన మెరూన్ రంగు చేనేత పట్టుచీరను ఎంచుకున్నారు. మస్టర్డ్ యెల్లో చెక్స్, ముదురు గోధుమ రంగు బోర్డర్తో కూడిన ఈ కాంచీపురం పట్టుచీర ఆమె నిబద్ధతకు, భారతీయ కళాకారులపై ఆమెకున్న గౌరవానికి ప్రతీకగా నిలిచింది. దీనికి కాంట్రాస్ట్ పసుపు రంగు బ్లౌజ్ను జతచేయడం ద్వారా ఆమె సాంప్రదాయ వేషధారణకు మరింత మెరుపు వచ్చింది.
2019లో తన మొదటి బడ్జెట్ నుంచి నేటి వరకు, నిర్మలా సీతారామన్ తన వస్త్రధారణ ద్వారా భారతదేశంలోని వైవిధ్యభరితమైన టెక్స్టైల్ రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆమె ఎంపిక కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు.. అది ఆయా ప్రాంతీయ కళలకు ఇచ్చే నివాళిగా నిలిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


