బ్యాంక్ ఉద్యోగాల అలర్ట్- ఎస్బీఐ రిక్రూట్మెంట్లో వేకెన్సీ సంఖ్య పెంపు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. పోస్టుల సంఖ్యను 1,146కి పెంచుతూ, దరఖాస్తు గడువును జనవరి 10, 2026 వరకు పొడిగించింది. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు శుభవార్త. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ (ఎస్సీఓ) రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్లో బ్యాంక్ కీలక సవరణలు చేసింది. గతంలో ప్రకటించిన ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు మరికొంత సమయాన్ని ఇచ్చింది. ఈ మేరకు అప్లికేషన్ గడువును పొడిగించింది.
ఎస్బీఐ ఎ ఎస్సీఓ రిక్రూట్మెంట్- ముఖ్యమైన తేదీలు, మార్పులు..
ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్ ప్రక్రియన డిసెంబర్ 2, 2025న ప్రారంభమైంది. ఇక తాజా సవరణ ప్రకారం.. అభ్యర్థులు జనవరి 10, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఫీజు చెల్లించవచ్చు.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్- పెరిగిన పోస్టుల వివరాలు..
వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో ఖాళీల సంఖ్యను భారీగా పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. తొలుత 996 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు ఆ సంఖ్యను 1,146కి పెంచారు.
సవరించిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
వైస్ ప్రెసిడెంట్ వెల్త్ (సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్): 582 పోస్టులు
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వెల్త్ (రిలేషన్షిప్ మేనేజర్): 237 పోస్టులు
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్: 327 పోస్టులు
గమనించాల్సిన విషయం ఏంటంటే.. వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు సంబంధించి పాత బ్యాక్లాగ్ ఖాళీలు అలాగే ఉంటాయి. కానీ, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఖాళీలను బ్యాంక్ తొలగించింది.
ఈ నియామకాలన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ అప్లికేషన్ కోసం కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్- ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది..
అభ్యర్థుల ఎంపిక కేవలం పరీక్ష ద్వారా కాకుండా వివిధ దశల్లో జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూలు (వ్యక్తిగత, టెలిఫోనిక్ లేదా వీడియో కాల్), చివరిగా సీటీసీ (జీతభత్యాల) చర్చలు ఉంటాయి.
షార్ట్ లిస్టింగ్: "కేవలం కనీస అర్హతలు ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూ కాల్ వస్తుందని భావించలేం. అభ్యర్థులను ఏ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేయాలి, ఎంత మందిని పిలవాలి అనే పూర్తి అధికారం బ్యాంక్కే ఉంటుంది. ఈ విషయంలో బ్యాంక్ తీసుకునే నిర్ణయమే ఫైనల్," అని ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్: ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫైయింగ్ మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. తుది మెరిట్ జాబితాను కేవలం ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగానే (అవరోహణ క్రమంలో) రూపొందిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే, వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యతనిచ్చి ర్యాంకు కేటాయిస్తారు.
జీతభత్యాలకు (సీటీసీ) సంబంధించి ఇంటర్వ్యూ సమయంలో లేదా ఆ తర్వాత అభ్యర్థులతో వ్యక్తిగతంగా చర్చిస్తారు. మిగిలిన అర్హత నిబంధనలు, ఎంపిక విధానంలో ఎలాంటి మార్పులు లేవని బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


