Udhayanidhi Stalin : త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్స్.. పోలీసుల అదుపులో ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin on Trisha : నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తానేమీ తప్పుచేయాలని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని ఉదయనిధి తేల్చిచెప్పారు.
తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా తీవ్ర దుమారంతో వేడెక్కింది. కావేరి జలాల వివాదంపై అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో ప్రతిపక్ష నేత, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనానికి దారితీశాయి. ప్రముఖ సినీ నటి త్రిషను, ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి ఆయన చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో ఉదయనిధిపై కేసు నమోదు కాగా, తమిళనాడు పోలీసులు ఆయన్ని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి స్పందిస్తూ.. “నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నేను విజయ్ పేరు తప్ప వేరే ఎవరి పేరూ ఎత్తలేదు. కావాలనే నాపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటాను,” అని పేర్కొన్నారు.
వివాదం ఎలా మొదలైందంటే..
కావేరి నీటి విడుదల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం విఫలమైందంటూ తంజావూరులో డీఎంకే చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలోని కొందరు వ్యక్తులు "త్రిష, త్రిష" అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి, సదరు నినాదాలకు సమాధానంగా అభ్యంతరకర రీతిలో రెండు అర్థాలు వచ్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా కించపరిచేలా, దిగజారుడు తనంతో ఉన్నాయంటూ తమిళనాడులోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా, తీవ్రంగా ఖండించాయి.
హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి..
ఈ వివాదం చెలరేగిన వెంటనే పోలీసులు ఉదయనిధిపై కేసు నమోదు చేసి, చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందస్తు అరెస్టును తప్పించుకోవడానికి ఉదయనిధి స్టాలిన్ వెంటనే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ విచారణకు వచ్చే ముందే, పోలీసులు ఉదయనిధి స్టాలిన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉదయనిధిని అదుపులోకి తీసుకుంటున్న తరుణంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. డీఎంకే నేతలు, కార్యకర్తలు ఉదయనిధి నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరి పోలీసులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
‘అశ్లీల నిధి’ అని తీవ్ర విమర్శలు..
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై అధికార తమిళగ వెట్రి కళగం (టీవీక) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీ నేత ఆథవ్ అర్జున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉదయనిధిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను "అశ్లీల నిధి" అని అభివర్ణించిన అర్జున, ఉదయనిధి రాజకీయ సంస్కృతిని దిగజార్చుతున్నారని ఆరోపించారు.
“గొప్ప తమిళ భాషా కోవిదుడైన అన్నాదురై ఎంతో శ్రమించి నిర్మించిన వ్యవస్థను, నేడు ఉదయనిధి తన అశ్లీల పదజాలంతో, ద్వంద్వార్థ ప్రసంగాలతో నాశనం చేస్తున్నారు. మహిళలపై ఆయనకున్న వికృత ఆలోచనలకు ఈ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. తమిళనాడులోని ఏ తల్లీ, చెల్లెలు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి నీచమైన ప్రసంగాలను అంగీకరించరు. ఇప్పటికే మహిళలు డీఎంకేను తిరస్కరించారు, రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయం నుంచే ఉదయనిధిని తుడిచిపెట్టడం ఖాయం,” అని ఆథవ్ అర్జున అన్నారు.
మరొకవైపు టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ మాట్లాడుతూ.. "ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలను ఉదయనిధి తన సొంత పిల్లల ముందు మాట్లాడగలరా?" అని ప్రశ్నించారు.
సమర్థించుకున్న డీఎంకే..
అయితే తమ నాయకుడి వ్యాఖ్యలను డీఎంకే సమర్థించుకుంది. మాజీ మంత్రి టీ మనో తంగరాజ్ ఈ వివాదంపై స్పందిస్తూ.. కావేరి నీటి సమస్య, డెల్టా రైతుల కష్టాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అధికార పక్షం ఈ రకమైన కుట్రపూరిత రాజకీయాలకు దిగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న కీలక ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికే ఉదయనిధి వ్యాఖ్యలను వక్రీకరించి రచ్చ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


