Tata Motors : 40శాతం నష్టాలు చూపిస్తున్న టాటా మోటార్స్ స్టాక్! ఇన్వెస్టర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..
టాటా మోటార్స్ షేరు ధర భారీగా పతనమైనట్టు కనిపిస్తోంది. దీనికి కారణం టాటా మోటార్స్ డీమర్జర్! టాటా మోటార్స్ నుంచి పీవీ విభాగం వేరు అవ్వడం ఇందుకు కారణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్స్ స్టాక్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకానొక దశలో 40శాతం నష్టాలతో రూ. 378 వద్ద ట్రేడ్ అయిన ఈ స్టాక్, ఉదయం 11గంటల సమయంలో 36శాతం లాస్లో రూ. 418 వద్ద కొనసాగుతోంది. ఇది చూసి ఇన్వెస్టర్లు కాస్త టెన్షన్ పడొచ్చు. అయితే, దీని వెనుక ఒక కారణం ఉంది. టాటా మోటార్స్ డీమర్జర్ నేడు అమల్లోకి వచ్చింది. టాటా మోటార్స్ డీమర్జర్ అనంతరం ట్రక్కులు (వాణిజ్య వాహనాలు), కార్ల (ప్యాసింజర్ వాహనాలు) వ్యాపార విభాగాలు స్టాక్ ఎక్స్ఛేంజ్లో విడివిడిగా ట్రేడ్ అవుతాయి. టాటా మోటార్స్ ఒక స్టాక్ ఉన్న వారికి డీమర్జర్ అయిన తర్వాత మరో స్టాక్ వచ్చి యాడ్ అవుతుంది.
టాటా మోటార్స్ పీవీ షేరు ధర..
డీమర్జర్ తర్వాత టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్గా పేరు మార్చుకున్న కార్ల యూనిట్ షేరు ధర, ప్రత్యేక ప్రీ-ఓపెన్ ధరల నిర్ణయం సెషన్లో రూ. 400 వద్ద లిస్ట్ అయింది. అయితే, బీఎస్ఈలో ఈ షేరు ధర 5.53% వరకు తగ్గి రూ. 376.90కి చేరుకుంది.
డీమర్జర్ తర్వాత, కార్ల తయారీ వ్యాపారం (ఎలక్ట్రిక్ కార్లు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సహా) అంతా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ కిందకు వస్తుంది.
భారతదేశంలోనే అతిపెద్ద ట్రక్కుల తయారీదారుగా ఉన్న వాణిజ్య వాహనాల విభాగాన్ని ఇకపై టాటా మోటార్స్ లిమిటెడ్గా పరిగిణిస్తారు.
ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ద్వారా ధరల నిర్ణయం..
ముంబైలో ఉదయం 9:00 గంటలకు ప్రారంభమైన ఒక గంట ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సెషన్ తర్వాత కొత్త టాటా మోటార్స్ షేరు ధర అమల్లోకి వచ్చింది. ఈ విండోలో నిర్ణయించిన ధర, సోమవారం ముగింపు ధర నుంచి ఉన్న వ్యత్యాసం ఆధారంగా టాటా మోటార్స్ సీవీ (వాణిజ్య వాహనాల విభాగం) విలువను నిర్ణయించడంలో సహాయపడుతుంది.
మార్కెట్ హెచ్చుతగ్గులను తగ్గించడానికి, డీమర్జర్లకు వెళ్లే కంపెనీల కోసం భారతీయ ఎక్స్ఛేంజ్లు 2023లో ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లను ప్రవేశపెట్టాయి!
కాగా.. బ్రోకరేజ్ సంస్థ నువమా వెల్త్ మేనేజ్మెంట్ అంచనా ప్రకారం, టాటా మోటార్స్ సీవీ షేరు ధర రూ. 274గా ఉండవచ్చు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 1 లక్ష కోట్లుగా ఉంటుందని అంచనా.
టాటా మోటార్స్ డీమర్జర్ ఉద్దేశం..
2024 మార్చ్లో తొలిసారిగా డీమర్జర్ని ప్రకటించింది టాటా మోటార్స్. కంపెనీ ఈవీ, జేఎల్ఆర్ వ్యాపారాల విలువను పెంచడం డీమర్జర్ ప్రధాన లక్ష్యం అని వివరించింది.
గ్రూప్ నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి, వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా పెట్టుబడి కేటాయింపులను సర్దుబాటు చేయడానికి ఈ డీమర్జర్ కీలకమైన చర్య అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గతంలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


