మార్కాపురం బస్సు ప్రమాదం : కంట్రోల్ రూమ్ ఏర్పాటు - సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
Markapuram Bus Accident Updates : మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం వెంటనే భీకర అగ్నిప్రమాదంగా మారింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి
ఈ దుర్ఙటనలో 13 మంది చనిపోగా… మరో 15 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ముందు భాగంలో ఉన్నవారిలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వెనకభాగంలో ఉన్నవారు బయటికి రాలేక… మంటల్లో కాలిపోయినట్లు తెలిసింది. మృతుల్లో కలికిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా పలువురు సజీవ దహనమయ్యారు. టిప్పర్ డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. సెమీ స్లీపర్ బస్సు కావడంతో బయటికి వచ్చేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తెలిసింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక బృందాలు కూడా రంగంలోకి దిగాయి.
ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడానికి 6304285613, 9985733999, 7989537285, 9703578434 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
E-Paper

