SBI recruitment : రూ. 2.5కోట్ల ప్యాకేజీతో ఎస్బీఐలో ఉద్యోగాలు! అప్లికేషన్కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ వేతనంతో కూడిన ఉద్యోగ ప్రకటనను ఇటీవలే విడుదల చేసింది. గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.2.5 కోట్ల దాకా ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 24 కాగా, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఐటీ, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అదిరిపోయే సువర్ణావకాశం కల్పించింది! దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో కూడిన అత్యున్నత పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాంకు సమగ్ర సైబర్ భద్రతా ప్రణాళికలు, సెక్యూరిటీ ఆపరేషన్లను పర్యవేక్షించేందుకు 'గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్' (సీఐఎస్ఓ) పోస్టును భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థి ఎస్బీఐ సమాచార వ్యవస్థల భద్రతకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు ఎంపికయ్యే నిపుణుడికి ముంబై లేదా నవీ ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అత్యున్నత స్థాయి పోస్టుకు ఏడాదికి గరిష్టంగా రూ.2.5 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇది స్థిరమైన మొత్తం కాదు. ఎంపికైన అభ్యర్థికి ఉన్న సీనియారిటీ, పని అనుభవం ప్రాతిపదికన నెగోషియేషన్ ద్వారా తుది ప్యాకేజీని ఖరారు చేస్తారు.
ఈ పోస్టుకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4, 2026 నుంచే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2026 నాటికి తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ నంబర్ CRPD/SCO/2026-27/21 ద్వారా ఈ వివరాలను అందుబాటులో ఉంచారు.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు భారతీయ పౌరులై ఉండాలి. ఆగస్టు 31, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 57 ఏళ్లు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం తప్పనిసరి. విద్యార్హతల విషయానికొస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీ.ఈ/బీ.టెక్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, సీఎస్ఈ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ, ఈసీఐ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులు చదివిన వారు అర్హులు. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఎంసిఏ, ఎం.టెక్, ఎం.ఎస్సీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
సీఐఎస్ఓ పోస్టుతో పాటు ఎస్బీఐ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరికొన్ని కీలక పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ (CRPD/SCO/2026-27/20) విడుదల చేసింది. కోల్కతాలోని 'స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్' లో డీన్, ఫ్యాకల్టీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 6, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు ప్రారంభంలో మూడేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి. పనితీరు ఆధారంగా మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం కల్పిస్తారు. ఇందులో ఇచ్చే వేతనంలో 80 శాతం ఫిక్స్డ్ పే రూపంలో, మిగిలిన 20 శాతం పర్ఫార్మెన్స్ ఆధారితంగా ఉంటుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. డీన్, ఫ్యాకల్టీ పోస్టులకు షార్ట్లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూతో పాటు ప్రెజెంటేషన్ డెమో సెషన్లు నిర్వహిస్తారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నిరుద్యోగులు, అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక కెరీర్స్ పేజీని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
E-Paper

