Vontimitta : నేడు ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవం - భక్తులకు తలంబ్రాలు, శ్రీవారి ప్రసాదం పంపిణీ
Sri Sitarama Kalyanam at Vontimitta : ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు తలంబ్రాలు ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం సిద్ధం చేశారు.
ఒంటిమిట్టలో ఇవాళ(ఏప్రిల్ 1) సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏకశిలానగరంలో ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందజేస్తారు.
కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఉంచారు.
నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేయగా… ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఉంటారు.
శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు భక్తులు చల్లని వాతావరణంలో నడిచేందుకు వీలుగా చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు సిద్ధం చేశారు.
టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు అందిస్తారు. అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్, మరో మూడు 3 సబ్ కంట్రోల్ రూమ్ ల నుండి పర్యవేక్షణ కొనసాగుతోంది. కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఉంచారు.
E-Paper

