తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ - ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం
Tirumala Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇవాళ పట్టువస్త్రాల సమర్పణతో పాటు పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, మ్యూజియంలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సంబరం అధికారికంగా మొదలైంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహోత్సవాలకు సోమవారం సాయంత్రం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు.
శ్రీవారి సర్వసేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవంగా వేంచేసి, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతూ వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ పవిత్ర సందర్భంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఈసారి సాధారణం కంటే 30 శాతం అదనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గరుడసేవ రోజున 38 శాతం అదనంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. అలాగే స్వామివారి ప్రసాదాలను 30 శాతం, టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానీయాల పంపిణీని 50 శాతం మేర పెంచారు. తిరుమలకు వచ్చే భక్తుల రవాణా ఇబ్బందులు తొలగించేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను మరో 500 ట్రిప్పులు పెంచి, మొత్తం 3,100 ట్రిప్పులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
మంగళవారం(ఇవాళ) సాయంత్రం 6.21 గంటల నుండి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ శుభసమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
అనంతరం సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన 'పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్', ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్ తో పాటు భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
వైఖానస ఆగమశాస్త్రంలో అంకురార్పణకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. 'అంకురం' అంటే విత్తనం మొలకెత్తడం అని అర్థం. నిర్వహిస్తున్న ఉత్సవాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని, స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని సంకల్పించడమే ఈ ప్రధాన ఘట్టం యొక్క ఉద్దేశం.
E-Paper

