Tiruchanoor : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - ఫొటోలు
Tiruchanoor Padmavathi Ammavari Vasanthotsavam 2026 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మే 1న స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు.
తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వసంత కాలంలో సూర్యకిరణాల తీవ్రత వల్ల కలిగే వేడి నుంచి ఉపశమనం పొందడానికి, భక్తులకు శారీరక, మానసిక శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ టీటీడీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది.
మేషరాశిలో సూర్యుడు ప్రకాశవంతంగా ఉండే ఈ సమయంలో అమ్మవారికి జరిగే ఈ అభిషేక సేవలను చూడటం భక్తులు అదృష్టంగా భావిస్తారు.
ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా ‘శుక్రవారపు తోట’కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి అమ్మవారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. అనంతరం రాత్రి మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ ఏడాది వసంతోత్సవాల కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారపు తోటను అచ్చం శేషాచలం అడవిని తలపించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, వివిధ రకాల జంతువుల ఆకృతులు భక్తులను కట్టిపడేస్తున్నాయి.
ఈ అలంకరణ కోసం 300 కేజీల వట్టివేరు, 500 కేజీల సంప్రదాయ పుష్పాలను వినియోగించారు. 15 వేల కట్ ఫ్లవర్స్ తో పాటు వివిధ రకాల పండ్లతో తోటను సుందరంగా తీర్చిదిద్దారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెంగళూరు, హైదరాబాద్ నిపుణులు ఈ అలంకరణలో పాలుపంచుకున్నారు.
వసంతోత్సవాల్లో రెండో రోజైన మే 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం అత్యంత కన్నుల పండువగా జరగనుంది.
బంగారు రథంపై అధిష్టించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.
E-Paper

