AP Inter Exams : ఇంటర్ సెకండియర్లోనూ 'ఇంప్రూవ్మెంట్' - పరిశీలనలో కొత్త ప్రతిపాదన..!
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయాన్ని ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు కేవలం మొదటి ఏడాది విద్యార్థులకే ఉన్న ఈ సదుపాయాన్ని అందరికీ వర్తింపజేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు కేవలం మొదటి ఏడాది విద్యార్థులకే ఉన్న ఈ సదుపాయాన్ని అందరికీ వర్తింపజేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.
సాధారణంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ మార్కులు తక్కువగా వస్తే 'ఇంప్రూవ్మెంట్' లేదా 'బెటర్మెంట్' పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది. అయితే, రెండో సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకు ఈ సౌకర్యం లేదు.
కేవలం ఫెయిల్ అయిన విద్యార్థులు మాత్రమే సప్లిమెంటరీ రాసుకోవడానికి వీలుండేది. ఈ నిబంధన వల్ల మార్కులు తక్కువగా వచ్చి, ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ స్కోర్ను మెరుగుపరుచుకునే అవకాశం కోల్పోతున్నారు. ఈ సమస్యపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం, ఇకపై సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ (JEE), నీట్ (NEET), అలాగే రాష్ట్ర స్థాయి ఈఏపీసెట్ (EAPCET) వంటి పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేకపోయినా, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులు కీలకంగా ఉంటాయి . కేవలం కొన్ని మార్కుల తేడాతో మంచి సీటు కోల్పోతున్నామని, రెండో ఏడాదిలో కూడా మార్కులు పెంచుకునే ఛాన్స్ ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు గత కొంతకాలంగా విద్యాశాఖను కోరుతున్నారు.
ఈ ప్రతిపాదనపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల బోర్డుపై పడే అదనపు భారం, పరీక్షల నిర్వహణకు కావాల్సిన సమయం, మరియు ఫలితాల విడుదలపై పడే ప్రభావం వంటి అంశాలను ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఒకసారి సెకండియర్ పాస్ అయితే మళ్లీ పరీక్ష రాసే వీలు లేదు. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే, ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా తమకు నచ్చిన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాసి, మెరుగైన మార్కులు సాధించిన పక్షంలో ఆ కొత్త మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ విషయంపై మరింత లోతుగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ప్రస్తుతానికి కాకుండా…. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయవచ్చని సమాచారం.
E-Paper

