Hyderabad Golconda Bonalu 2026 : గోల్కొండ కోటలో ఘనంగా ఆషాడ బోనాలు - అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఫొటోలు
Hyderabad Golconda Bonalu 2026 : హైదరాబాద్ గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఆషాడ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సమున్నత ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక ఆషాడ బోనాల ఉత్సవాలు భాగ్యనగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ ఏడాది ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు విచ్చేసిన మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఇద్దరూ కలిసి డప్పు చప్పుళ్ళు, పోతురాజుల వీర విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సాంస్కృతిక కళాకారుల కోలాటాల నడుమ ఊరేగింపుగా వెళ్లారు. శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాకారుల అభ్యర్థన మేరకు మంత్రి సురేఖ చేతిలో ఈరగోల ధరించి, వారిని ఉత్సాహపరిచారు.
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా రూపొందించిన 'ఆషాడ బోనాల ఉత్సవాల బుక్ లెట్'ను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అనంతరం జగదాంబిక ఆలయ కమిటీ నిర్వాహణ కోసం ప్రభుత్వం తరఫున రూ. 11 లక్షల చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్కు ఇరువురు మంత్రులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వానికి అద్దం పట్టేలా బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహిస్తోందని చెప్పారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల గావు కేకలతో హైదరాబాద్ అంతటా ఇప్పుడే పండుగ వాతావరణం సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఈ ఏడాది దేశంపై ఎల్ నినో ప్రభావం పూర్తిగా తగ్గిపోవాలని, భూతల్లి శాంతించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు పడి తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆషాడ బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, లైన్లు, మంచినీరు, భద్రత పరంగా సకల ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులంతా ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని వెళ్లాలని కోరారు.
అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. పోతరాజులతో కలిసి నృత్యం చేసూ సందడి చేశారు.
E-Paper

