సికింద్రాబాద్ నుంచి అయోధ్య- కాశీ, దివ్య దక్షిణ టూరిస్ట్ రైళ్లు- షెడ్యూల్, స్టాప్ వివరాలు..
తెలుగు రాష్ట్రాల యాత్రికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ వేదికగా అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, దివ్య దక్షిణ యాత్ర పేరిట రెండు సరికొత్త భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ప్రకటించింది. ఆ వివరాలు..
పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం ఐఆర్సీటీసీ రెండు సరికొత్త 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. "అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (వైద్యనాథ్ ధామ్తో కలిపి)", "దివ్య దక్షిణ యాత్ర (అరుణాచలంతో కలిపి)" పేరిట ఈ ప్రత్యేక ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఈ రెండు రైళ్లు కూడా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే బయలుదేరనున్నాయి. ఇందులో మొదటి రైలు జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో రైలు జులై 20వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.
(image source Pixel)
రూట్ 1: అయోధ్య-కాశీ-వైద్యనాథ్ పుణ్యక్షేత్ర యాత్ర ఈ ప్రత్యేక ప్యాకేజీ మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగుతుంది. ప్రయాణం, వసతి, శాకాహార భోజన వసతి, రైలులో సెక్యూరిటీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సేవలన్నీ ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది. ఈ యాత్రలో గయలోని విష్ణుపాద దేవాలయం, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలు, సాయంత్రం వేళ జరిగే గంగా హారతి వీక్షణ, అయోధ్యలోని రామజన్మభూమి, హనుమాన్గఢీ
ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, ఝార్ఖండ్లోని ప్రసిద్ధ బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాలను సందర్శించవచ్చు.
ఈ రైలు బోర్డింగ్, డీబోర్డింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సౌకర్యం కల్పించారు. తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం స్టేషన్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఈ సదుపాయం ఉంది.
రూట్ 2: దివ్య దక్షిణ యాత్ర (అరుణాచలం రూట్) దక్షిణ భారతంలోని ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రాలను కవర్ చేస్తూ రూపొందించిన ఈ యాత్ర 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో సందర్శించే ముఖ్య క్షేత్రాలు.. అరుణాచలేశ్వర ఆలయం (తిరువణ్ణామలై), చిదంబరం నటరాజ స్వామి ఆలయం, శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి క్షేత్రం, తంజావూరు బృహదీశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురై మీనాక్షి అమ్మవారి కోవెల, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం.
ఈ రైలు కోసం తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.. ఆంధ్రప్రదేశ్లోని మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ఈ రెండు టూర్ ప్యాకేజీలలోనూ యాత్రికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో కూడిన పూర్తి సురక్షితమైన స్వచ్ఛమైన శాకాహార భోజన సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ అందిస్తోంది. ప్రతి కోచ్లోనూ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్, పర్యవేక్షణకు ప్రత్యేక టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు. ఈ ప్యాకేజీల పూర్తి వివరాలు, టికెట్ ధరలు, బుకింగ్ కోసం భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ను సందర్శించవచ్చు.
E-Paper

