2027 మార్చి నాటికి.. దేశవ్యాప్తంగా బారికేడ్లు లేని టోల్ గేట్లు : గడ్కరీ
నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తిరుగులేని తీపి కబురు అందించింది. 2027 మార్చి నాటికి దేశంలోని టోల్ ప్లాజాల వద్ద బారికేడ్లను పూర్తిగా తొలగించి, బ్యారియర్ ఫ్రీ టోలింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించే రోజులకు త్వరలోనే కాలం చెల్లనుంది. వాహనదారులు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లేందుకు వీలుగా దేశమంతటా 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' లేదా బారికేడ్లు లేని డిజిటల్ టోలింగ్ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో పాల్గొన్న ఆయన, 2027 మార్చి నాటికి దేశంలోని నేషనల్ హైవేలపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను పూర్తిస్థాయిలో బ్యారియర్ ఫ్రీగా మార్చడమే లక్ష్యమని వెల్లడించారు.
ఫలితంగా హైదరాబాద్-విజయవాడ (ఎన్హెచ్-65), హైదరాబాద్-బెంగళూరు (ఎన్హెచ్-44) వంటి బిజీ జాతీయ రహదారులపై పండగలు, వారాంతాల్లో పంతంగి, కొర్లపహాడ్ లాంటి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు పడే అవస్థలు ఇక గతంగా మారనున్నాయి!
టోల్ బూత్ల వద్ద నిరీక్షణ సమయం తగ్గడం వల్ల వాహనదారులకు ఇంధన ఖర్చులు ఆదా అవుతాయి. కేవలం ఇంధనం రూపంలోనే వాహనదారులకు ఏడాదికి రూ. 5,250 కోట్లకు పైగా ఆదా అవుతున్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడించాయని గడ్కరీ గుర్తుచేశారు. సమయం ఆదా కావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు రూ. 68,500 కోట్ల పరోక్ష ప్రయోజనం కలుగుతుందని ఆయన అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వ్యవస్థకు సంబంధించిన కీలక వివరాలను గడ్కరీ వెల్లడించారు. ఫాస్టాగ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్ వసూళ్లు ఏకంగా 10 శాతం పెరిగాయని తెలిపారు. "గతంలో రూ. 7,000 కోట్లుగా ఉన్న టోల్ ఆదాయం ఫాస్టాగ్ పుణ్యమా అని ప్రస్తుతం రూ. 82,000 కోట్లు దాటింది. ఇప్పుడు తీసుకువస్తున్న బ్యారియర్ ఫ్రీ విధానంతో మరో 10 శాతం అంటే సుమారు రూ. 7,000 కోట్ల నుంచి రూ. 8,000 కోట్ల వరకు అదనపు రాబడి సమకూరనుంది," అని వివరించారు.
ఫాస్టాగ్ వ్యవస్థను వంద శాతం అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ. 20,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందని మంత్రి లెక్కలు వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికే దాదాపు 70 శాతం టోల్ ప్లాజాల్లో బారికేడ్లను తొలగిస్తామని, మిగిలిన పనిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా, ఒకప్పుడు టోల్ ప్లాజాల నిర్వహణకు 12 నుంచి 15 శాతం వరకు ఖర్చు అయ్యేదని, డిజిటలైజేషన్ వల్ల అది 2 నుంచి 3 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని చెప్పారు.
E-Paper

