ఫొటోలు : గీత కార్మికుడితో ఆత్మీయ సంభాషణ - కల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Tastes Kallu : కాకినాడ జిల్లా చామవరంలో కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటిని సీఎం చంద్రబాబు సందర్శించారు. స్వయంగా వెళ్లి రూ.4వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించారు. కుటుంబంతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజా కల్లు రుచిని చూశారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లారు. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనకు 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద రూ.4 వేల పింఛన్ సొమ్మును స్వయంగా అందజేశారు. కేవలం పింఛన్ ఇవ్వడమే కాకుండా, ఆ కుటుంబంతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
పింఛన్ డబ్బులు చేతికి అందించిన తర్వాత సింహాచలంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. "వాలంటీర్లు లేదా అధికారులు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా?" అని సీఎం ఆరా తీశారు. దీనికి సింహాచలం స్పందిస్తూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా తమ ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కల్లు గీయడం వల్ల నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు మిగులుతుందని, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ తమ కుటుంబ పోషణకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని సింహాచలం ముఖ్యమంత్రికి వివరించారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. గీత కార్మికులను ఆదుకునేందుకే సబ్సిడీపై మద్యం దుకాణాలను కేటాయించామని చంద్రబాబు గుర్తుచేశారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో కల్లు గీసే విధానాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. తాటిచెట్టుపై నుంచి అప్పుడే తీసిన తాజా కల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుచి చూశారు.
ఈ సంభాషణ సమయంలో సింహాచలం తనకున్న కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తనకు సొంతిల్లు లేదని, కనీసం తాగునీటి కోసం ట్యాప్ కనెక్షన్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన వృత్తిని, తోటి కార్మికులను కూడా ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
సింహాచలం విన్నపంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. సింహాచలానికి వెంటనే ఒక సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ఇంటికి తాగునీటి కుళాయి (ట్యాప్ కనెక్షన్) ఏర్పాటు చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.సింహాచలం కుటుంబానికి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా వారి ఇంట్లో అర్హులకు ఉద్యోగం లేదా ఏదైనా ఉపాధి అవకాశం చూపించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
E-Paper

