Muskmelon : ఎండాకాలంలో ఖర్బూజను అస్సలు లైట్ తీసుకోవద్దు.. ఎందుకో తెలిస్తే రోజూ తింటారు!
ఎండకాలంలో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయలకు ఉన్నంత ఆదరణ ఖర్బూజకు ఉండదు. కానీ, రోజూ ఒక కప్పు ఖర్బూజ తినడం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను చెక్ పెట్టవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వాత్స్య చెబుతున్నారు. ఖర్బూజతో ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి..
పీసీఓఎస్ సమస్యకు చెక్ - సాధారణంగా ఇనోసిటాల్ను విటమిన్ బీ8 అని పిలుస్తారు. టెక్నికల్గా ఇది విటమిన్ కానప్పటికీ, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక షుగర్ ఆల్కహాల్. ఇది కణాల నిర్మాణాన్ని కాపాడటానికి, ఇన్సులిన్ సిగ్నలింగ్ను మెరుగుపరచడానికి, మెదడు పనితీరుకు సహాయపడుతుంది. డాక్టర్ వాత్స్య ప్రకారం.. “ఒక కప్పు ఖర్బూజ ముక్కలలో దాదాపు 500 నుంచి 600 మిల్లీగ్రాముల ఇనోసిటాల్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే శరీరంలో ఫ్యాట్ మెటబాలిజం (కొవ్వు కరగడం) ప్రక్రియకు మద్దతు ఇస్తుంది. ఈ కారణాల వల్ల మహిళల్లో వచ్చే పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయం వంటి హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో కర్బూజ క్లినికల్గా అద్భుతంగా పనిచేస్తుంది.”
పవర్ఫుల్ కాంబినేషన్- మిగతా వేసవి పండ్లలాగే ఖర్బూజలో కూడా నీటి శాతం చాలా ఎక్కువ. దీనివల్ల శరీరం సహజంగానే చల్లబడుతుంది. అయితే, దీనితో పాటు ఇందులో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి, నరాల సంకేతాలను పంపడానికి, కండరాల కదలికలను నియంత్రించడానికి తోడ్పడతాయి. డాక్టర్ వాత్స్య మాటల్లో చెప్పాలంటే.. “ఖర్బూజలో 90 శాతం నీరు ఉంటుంది. అలాగే ఇందులోని పొటాషియం కిడ్నీల వడపోత ప్రక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో అదనపు నీరు నిలిచిపోకుండా చూస్తూ, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది."
ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్ల సమాహారం- శరీరానికి అత్యంత అవసరమైన పీచుపదార్థం ఖర్బూజలో పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల గోడలను, గట్ మైక్రోబయోమ్ (మంచి బ్యాక్టీరియా) ను సంరక్షిస్తుంది. అంతేకాకుండా తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది.
ఖర్బూజలో విటమిన్ సీ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన ‘బీటా కెరోటిన్’ (పండ్లకు రంగునిచ్చే పిగ్మెంట్) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి, చర్మాన్ని కాపాడతాయి, కణాల నష్టాన్ని, శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ను నెమ్మదింపజేస్తాయి.
“వేసవి కాలంలో ప్రతిరోజూ ఒక కప్పు ఖర్బూజ పండును ఖచ్చితంగా తినండి. ఇది కేవలం మీ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. ఒకేసారి హైడ్రేషన్, మెటబాలిజం, ఇన్సులిన్ రెస్పాన్స్, జీర్ణక్రియ.. ఇలా అన్నింటినీ చక్కగా చూసుకుంటుంది,” అని డాక్టర్ శుభమ్ వాత్స్య సూచించారు.
E-Paper

