IPL valuation : భారీ ఆర్థిక శక్తిగా ఐపీఎల్- 18 బిలియన్ డాలర్లకు చేరిన సామ్రాజ్యం!
కోటక్ మ్యూచువల్ ఫండ్ తాజా నివేదిక ప్రకారం, ఐపీఎల్ విలువ ప్రస్తుతం 18 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీ, భారతదేశ మొత్తం క్రీడా రంగం విలువతో సమానమైన ఆదాయాన్ని సృష్టిస్తోంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కేవలం క్రికెట్ మైదానానికే పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక శక్తివంతమైన 'ఎకనామిక్ ఇంజిన్'గా అవతరించింది. కోటక్ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఐపీఎల్ వ్యాపార సామ్రాజ్యం విలువ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు (సుమారు ₹1.6 లక్షల కోట్లు) చేరుకుంది.
విశేషమేమిటంటే, భారతదేశం మొత్తం క్రీడా రంగం విలువ 19 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా.. కేవలం రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ టోర్నీ దాదాపు దానికి సమానమైన ఆర్థిక విలువను సృష్టించడం గమనార్హం!
ఐపీఎల్ ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలు : ఐపీఎల్ ఎదుగుదలలో మీడియా హక్కులు కీలక పాత్ర పోషించాయి. 2008లో కేవలం 918 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ హక్కుల విలువ, 2023-2027 కాలానికి ఏకంగా 6.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది ప్రపంచంలోని ఇతర దిగ్గజ క్రీడా లీగ్ల వృద్ధి రేటు కంటే ఎంతో ఎక్కువ. టీవీ, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఐపీఎల్ దాదాపు 100 కోట్ల మంది ప్రేక్షకులకు చేరువవుతోంది. దీనివల్ల కేవలం ప్రకటనల ద్వారానే 600 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఐపీఎల్ జట్లు కేవలం క్రీడా క్లబ్లుగా కాకుండా, "ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్" (స్థిర ఆస్తులు) వలె పనిచేస్తున్నాయని కోటక్ నివేదిక పేర్కొంది. ఫ్రాంచైజీల మొత్తం ఆదాయంలో 70 శాతం వాటా బీసీసీఐ సెంట్రల్ పూల్ (మీడియా హక్కులు, స్పాన్సర్షిప్స్) నుండే వస్తుంది. దీనివల్ల జట్లకు స్థిరమైన నగదు ప్రవాహం అందుతుంది.
కరోనా మహమ్మారి సమయంలో ఐపీఎల్ విలువ కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. నేడు ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇదొక "టెక్నాలజీ ఆధారిత మీడియా ఎకోసిస్టమ్". మీడియా, ప్రకటనలు, స్పాన్సర్షిప్లతో పాటు పర్యాటక, రవాణా రంగాలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ లీగ్ ద్వారా ఏటా 182 మిలియన్ డాలర్ల నుంచి 6.7 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం సమకూరుతోందని నివేదిక స్పష్టం చేసింది.
E-Paper

