Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - తొలి ప్రమాద హెచ్చరిక జారీ!
Bhadrachalam Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరద ప్రవాహం తీవ్రమవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల మార్కును తాకింది.
(ఫైల్ ఫొటో)
నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం మరియు నీటిపారుదల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంత వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ఉపశమన చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పరిణామాలు, నీటి ప్రవాహ వేగాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసర సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. నదిలోకి ఎవరూ దిగవద్దని, మత్స్యకారులు మరియు స్థానికులు సాహసాలు చేయవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేసింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా,అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడ తాగునీరు, ఆహారం, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
E-Paper

