AC health issues : సమ్మర్ కదా అని ఏసీలోనే ఉండిపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! అనేక ఆరోగ్య సమస్యలు..
ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు ఏసీ అనేది లగ్జరీ కాదు, ఒక అనివార్యతగా మారింది. ఆఫీసులో ఏసీ, కారులో ఏసీ, రాత్రి పడుకునేటప్పుడు ఏసీ.. ఇలా రోజులో దాదాపు 20 గంటల పాటు కృత్రిమ చల్లదనంలోనే గడిపేస్తున్నారు!. అయితే, ఇది మీ ప్రాణాల మీదకు తెస్తుందని మీకు తెలుసా?
ఏసీ గదుల్లో ఉండేవారిలో 50 శాతం ఎక్కువ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని 'వాటర్, ఎయిర్ అండ్ సాయిల్ పొల్యూషన్' జర్నల్ వెల్లడించింది. అలాగే, సహజ గాలి తగిలే చోట ఉండేవారి కంటే, సెంట్రల్ ఏసీ భవనాల్లో ఉండేవారు 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' (ఎస్బీఎస్) బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ఏసీ యూనిట్లు, ముఖ్యంగా సెంట్రల్ కూలింగ్ వ్యవస్థలు తేమను పట్టి ఉంచుతాయి. కూలింగ్ కాయిల్స్పై పేరుకుపోయే నీటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే, అది బ్యాక్టీరియా, ఫంగస్లకు నిలయంగా మారుతుంది. 'లెజియోనెల్లా' వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఈ నీటిలో వృద్ధి చెంది, గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది! ఇది ప్రాణాంతకమైన 'నిమోనియా'కు దారితీసే ప్రమాదం ఉంది.
ఏసీ మెషిన్ గదిలోని తేమను పీల్చుకుని చల్లదనాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో అది గాలిలోని తేమతో పాటు మన చర్మం, కళ్లలోని తేమను కూడా పీల్చేస్తుంది. ఫలితంగా కళ్లు ఎర్రబడటం, దురద, చూపు మసకబారడం వంటివి జరుగుతాయి. చర్మం పొడిబారిపోయి దురదలు రావడం, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది.
ఏసీ గదుల్లో గాలి బయటికి వెళ్లే అవకాశం ఉండదు. అదే గాలి మళ్లీ మళ్లీ రీ-సర్క్యులేట్ అవుతుంటుంది. "ఏసీ ఫిల్టర్లను ప్రతి 15-30 రోజులకు ఒకసారి శుభ్రం చేయకపోతే, మీరు దుమ్ము, ధూళి, ఫంగస్ నిండిన గాలినే మళ్లీ మళ్లీ పీలుస్తున్నారు," అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆస్తమా అటాక్స్కు, క్రానిక్ సైనస్కు కారణమవుతుందని చెబుతున్నారు.
బయట 45 డిగ్రీల ఎండలో ఉండి, ఒక్కసారిగా 18 డిగ్రీల ఏసీ గదిలోకి ప్రవేశించినప్పుడు శరీరం 'థర్మల్ షాక్'కు గురవుతుంది. ఇంత భారీ ఉష్ణోగ్రత మార్పును తట్టుకోవడం మన శరీరానికి కష్టమవుతుంది. దీనివల్ల రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోయి, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తరచుగా జలుబు, ఫ్లూ, కండరాల నొప్పులు రావడానికి ఇదే ప్రధాన కారణం.
ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండేవారిలో తరచుగా తల భారంగా ఉండటం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గది మూసి ఉండటం వల్ల కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగి, ఆక్సిజన్ అందక మెదడు చురుకుదనం తగ్గుతుంది. మధ్యాహ్నం పూట ఆఫీసులో వచ్చే నిద్రమత్తుకు కారణం భారీ భోజనం మాత్రమే కాదు, ఏసీ గాలిలోని నాణ్యత లోపించడం కూడా కావచ్చు.
సురక్షితంగా ఏసీని ఎలా వాడాలి? : ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 24°C నుంచి 26°C మధ్య ఉంచండి. ఇది థర్మల్ షాక్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దాహం వేయకపోయినా నీరు తాగుతూ ఉండాలి. డ్రై ఎయిర్ వల్ల శరీరం కోల్పోయే తేమను ఇది భర్తీ చేస్తుంది. ప్రతి నాలుగు గంటల ఏసీ వాడకం తర్వాత, కాసేపు ఏసీ ఆపి కిటికీలు తెరవండి. దీనివల్ల తాజా ఆక్సిజన్ లోపలికి వస్తుంది. చర్మం, కళ్లు మరీ పొడిబారుతున్నట్లు అనిపిస్తే గదిలో ఒక చిన్న హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడం మంచిది. ఇక పీక్ సమ్మర్లో కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను స్వయంగా క్లీన్ చేయండి. సీజన్ మొదట్లో ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి.
E-Paper

