Bullet train : రయ్ రయ్! హైదారాబాద్- అమరావతి- చెన్నై బుల్లెట్ ఆగే ట్రైన్ స్టేషన్స్ ఇవే..!
హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్కు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 760 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో ఏపీలోనే అత్యధికంగా 518 కిలోమీటర్ల మేర ట్రాక్, 9 స్టేషన్లు రానున్నాయి. 12 గంటల ప్రయాణ సమయం కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గనుంది! వివరాలు..
దక్షిణ భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన భాగస్వామిగా మారబోతోంది! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న హైదరాబాద్ - అమరావతి - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్కు అడుగులు పడ్డాయి. ఈ రూట్ను ఏపీ రాజధాని అమరావతి మీదుగా వెళ్లేలా డిజైన్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవలే సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సాగే ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొత్తం పొడవు 760.09 కిలోమీటర్లు. ఈ మొత్తం ప్రాజెక్టులో సింహభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. ఏపీలో అత్యధికంగా 518.54 కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ రైలు మార్గం నిర్మిస్తారు. తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. దీనితో పాటు చిత్తూరు - తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ ప్రత్యేక హైస్పీడ్ లింక్కు కూడా ప్రాథమిక ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు! ఈ కారిడార్ మొత్తంలో 18 స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో సగానికి సగం అంటే 9 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే రాబోతున్నాయి.
(Representative Image)
తెలంగాణ పరిధిలో: హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ హబ్స్ అయిన గచ్చిబౌలి లేదా నానక్రామ్గూడ ప్రాంతాల నుంచి ఈ హైస్పీడ్ కారిడార్ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయం, భారత్ సిటీ, డ్రై పోర్ట్ మీదుగా ప్రయాణిస్తుంది. తెలంగాణ సరిహద్దులు దాటడానికి ముందు హాలియా, వాడపల్లిలలో బుల్లెట్ ట్రైన్ ఆగుతుంది.
ఆంధ్రప్రదేశ్ పరిధిలో: తెలంగాణ సరిహద్దు దాటాక ఏపీలో మొదటి స్టేషన్ దాచేపల్లిలో ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర రాజధాని అమరావతికి, ఆ వెంటనే పక్కనే ఉన్న గుంటూరు నగరానికి బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది. ఆ తర్వాత చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణిస్తూ.. ఏపీలో చివరి స్టాప్ అయిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి చేరుకుంటుంది.
(Representative Image)
తమిళనాడు పరిధిలో: ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత తమిళనాడులో మొదటి స్టాప్ తిరువళ్లూరులో ఉంటుంది. చెన్నై నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా.. మింజూర్ సమీపంలోని చెన్నై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేస్తారు. చివరగా ఈ 760 కిలోమీటర్ల కారిడార్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్తో ముగుస్తుంది. ఈ మెగా ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
E-Paper

