ఏపీకి ఐఎండీ అలర్ట్ - ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు..! హెచ్చరికలు జారీ
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ గురువారంలోగా అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతారవణశాఖ అంచనా వేస్తోంది.
ఇవాళ(డిసెంబర్ 4, 2025) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇక ఏపీలోని ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (జిల్లా) తొట్టంబేడులో 47.2 మిమీ, నెల్లూరు(జిల్లా) కృష్ణపట్నంలో 37.5 మిమీ, తిరుపతి(జిల్లా) మన్నారుపోలూరులో 32.7మిమీ, చిత్తూరు(జిల్లా) నిండ్రలో 30 మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అనూహ్యంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా వాకాడులో 28.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
E-Paper

