Telangana Rains : చల్లబడిన వాతావరణం - హైదరాబాద్లో పలుచోట్ల వడగళ్ల వర్షం..! ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత నగరంలోని చాలాచోట్ల వర్షం మొదలైంది. దీంతో భానుడి భగభగలకి ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు ఉపశమనం కలిగినట్లు అయింది.
హైదరాబాద్లో పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్పల్లి, బాలానగర్లో వడగళ్ల వాన పడగా… కూకట్పల్లి, కేపీహెచ్బీ, ప్రగతినగర్, సికింద్రబాద్, తిరమలగిరి, అల్వాల్లో మోస్తారు వర్షం పడింది.
ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఎండ తగ్గిపోగా… వాతావరణం చల్లబడింది.
(AFP File )
వేసవి తాపంతో అల్లాడుతున్న సమయంలో కురిసిన ఈ అకాల వర్షం ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రాబోయే కొన్ని గంటల పాటు నగరంలో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు సూచించారు.
ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(image source @APSDMA)
E-Paper

