AP Weather Alert : ఏపీకి ఐఎండీ అలర్ట్ - 4 రోజులపాటు వర్షాలు, తీరం వెంబడి ఈదురుగాలులు..!
Andhrapradesh Weather Alert : ఏపీలో రానున్న 4 రోజుల పాటు మేఘావృత వాతావరణంతో పాటు పలుచోట్ల వర్షాలు కురుసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, కడప సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
ముఖ్యంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు హెచ్చరికలను జారీ చేసింది.
ఇవాళ(జూలై 19) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల మరియు కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు పలు సూచనలు చేసింది. ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా భారీ హోర్డింగుల వద్ద నిలబడకూడదని హెచ్చరించింది.
సముద్రం తీవ్ర అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
E-Paper

