CCTV ban : ఆ సీసీటీవీలపై భారత్ బ్యాన్- నేటి నుంచే అమలు.. మీ ఇంట్లో ఉన్నది కూడా తీసేసుకుంటారా?
దేశ భద్రత, సైబర్ దాడుల ముప్పును అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన సీసీటీవీ కెమెరా తయారీ సంస్థలపై కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా విక్రయించే అన్ని ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీ కెమెరాలు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం తప్పనిసరి.
తాజా రూల్స్ ప్రకారం.. భారత్లో విక్రయించే ప్రతి ఇంటర్నెట్ కనెక్టెడ్ కెమెరా.. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్' ఫ్రేమ్వర్క్ నుంచి క్లియరెన్స్ పొందాలి.
కొత్త రూల్స్ ప్రకారం.. కెమెరా డేటాను రిమోట్గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో తనిఖీ చేస్తారు. కెమెరాలో వాడే ప్రాసెసర్ ఎక్కడ తయారైంది? హార్డ్వేర్ మూలాలు ఏంటి? అనే వివరాలను కంపెనీలు వెల్లడించాలి. ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, ఫిర్మ్వేర్, ట్యాంపరింగ్ను తట్టుకునే సామర్థ్యం వంటి పారామీటర్లపై ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుంది. భారత్లో అసెంబుల్ చేసిన పరికరాలు కూడా ఈ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఇందులో విఫలమైతే ఆ కెమెరాల విక్రయాలను చట్టబద్ధంగా నిలిపివేస్తారు.
భారత మార్కెట్లో భారీ వాటా కలిగిన హైక్విజన్, టీపీ-లింక్, దహువా వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో ఈ కంపెనీలే భారత మార్కెట్ను శాసించేవి.
మీరు ఇప్పటికే ఇంట్లో లేదా ఆఫీసులో వాడుతున్న చైనా కెమెరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. అవి యథావిధిగా పనిచేస్తాయి. అయితే, భవిష్యత్తులో వాటికి సాఫ్ట్వేర్ అప్డేట్లు రావడం లేదా రిపేర్ సర్వీసులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
ఈ రూల్స్తో చైనా బ్రాండ్లు వెనక్కి తగ్గితే సీపీ ప్లస్, ప్రామా, క్యూబో, మ్యాట్రిక్స్, స్పర్ష్ వంటి భారతీయ బ్రాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, ప్రభుత్వ నిబంధనల పాటింపునకు అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో మిడ్- ప్రీమియం సెగ్మెంట్ కెమెరాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
E-Paper

