IPL 2026 final : ట్రోఫీతో పాటు ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ కోసం టఫ్ ఫైట్! ఎవరికి దక్కేనో..
RCB vs GT final : ఐపీఎల్ 2026లో చివరి ఘట్టం! ఇంకొన్ని గంటల్లో ఆర్సీబీ- జీటీ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ రాత్రి జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ మూడు ప్రధాన కారణాల వల్ల క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ఆ ఆసక్తికరమైన సమీకరణలు, మైల్స్టోన్స్ వివరాలు ఇక్కడ చూసేయండి..
ఐపీఎల్ 2026 మహాసంగ్రామం క్లైమాక్స్కు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు (మే 31) రాత్రి జరగబోయే గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఐపీఎల్ ట్రోఫీ విజేతను నిర్ణయించడమే కాకుండా.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ‘ఆరెంజ్ క్యాప్’, అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే ‘పర్పుల్ క్యాప్’ విజేతలు ఎవరో కూడా తేల్చనుంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని దాటేసి ఆరెంజ్ క్యాప్ కొట్టే అవకాశం శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లకు ఉండగా.. పర్పుల్ క్యాప్ కోసం కాగిసో రబడా, భువనేశ్వర్ కుమార్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా వారి ఖాతాలో రెండవ ఐపీఎల్ ట్రోఫీ చేరుతుంది. అయితే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడొవ జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టిస్తుంది. అలాగే రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనిల తర్వాత ఈ ఘనత సాధించిన మూడొవ కెప్టెన్గా రజత్ పటిదార్ నిలుస్తాడు. మరోవైపు జీటీ గెలిస్తే, ఆ జట్టుకు కూడా ఇది రెండో ట్రోఫీ అవుతుంది. తమ అరంగేట్రం సీజన్ (2022)లోనే గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టిన విషయం తెలిసిందే
ఆరెంజ్ క్యాప్ రేస్- ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో (సగటు 48.50) అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు అతడిని అధిగమించే సువర్ణావకాశం ఉంది.
వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవాలంటే గిల్కు ఈ మ్యాచ్లో 55 పరుగులు కావాలి. (గిల్ ఇప్పటికే 2023లో 890 పరుగులతో ఒకసారి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు). సాయి సుదర్శన్ టాప్ ప్లేస్కు చేరాలంటే ఈ రాత్రి ఫైనల్లో 67 పరుగులు చేయాల్సి ఉంటుంది. (సుదర్శన్ గత సీజన్ 2025లో 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలిచాడు). ఒకవేళ ఈ ఇద్దరు ఓపెనర్లు రాణించి 776 పరుగుల మార్కును దాటితే.. ఆరెంజ్ క్యాప్ కోసం వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.
పర్పుల్ క్యాప్ రేస్- వికెట్ల వేటలో గుజరాత్ టైటాన్స్ స్పీడ్స్టర్ కాగిసో రబడా, ఆర్సీబీ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. రబాడా ప్రస్తుతం 28 వికెట్లతో లిస్టులో టాప్లో ఉన్నాడు. ఇతడి ఎకానమీ రేటు 9.43గా ఉంది. మరోవైపు 26 వికెట్లతో రబడా కంటే కేవలం రెండు వికెట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఇతడి ఎకానమీ రేటు 8.00గా ఉంది. ఒకవేళ ఈ రాత్రి మ్యాచ్ ముగిసేసరికి రబడా, భువీ ఇద్దరూ సమానమైన వికెట్లతో నిలిస్తే.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెరుగైన ఎకానమీ రేటు (8.00) ఉన్నందున భువనేశ్వర్ కుమార్కే 'పర్పుల్ క్యాప్' దక్కుతుంది.
(ANI Photo)
ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ హైదరాబాద్ తరపున వరుసగా రెండుసార్లు (2016, 2017) పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్గా భువీకి రికార్డు ఉంది. ఈరోజు బాగా రాణిస్తే అతడి కెరీర్లో ఇది మూడవ పర్పుల్ క్యాప్ అవుతుంది. మరోవైపు రబడా కూడా గతంలో దిల్లీ క్యాపిటల్స్ (2020లో 30 వికెట్లు) తరపున ఒకసారి పర్పుల్ క్యాప్ సాధించాడు. వ్యక్తిగత మైల్స్టోన్స్, జట్టు ప్రతిష్ట ఇమిడి ఉన్న ఈ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కు అసలైన వినోదాన్ని పంచడం ఖాయం!
E-Paper

