Kidney stones : నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్లు రావనుకుంటున్నారా? పొరబడినట్టే!
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే నీళ్లు బాగా తాగాలని మనందరికీ తెలిసిన విషయమే. అయితే 2026లో ‘ది లాన్సెట్’ ప్రచురించిన ఒక సంచలన అధ్యయనం ఈ పాత నమ్మకాన్ని ప్రశ్నిస్తోంది. కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే కిడ్నీలో రాళ్ల మళ్లీ రాకుండా అడ్డుకోలేమని, దీనికి సమగ్రమైన జీవనశైలి మార్పులు అవసరమని తేల్చిచెప్పింది.
కిడ్నీలో రాళ్లు.. వినడానికి చిన్న సమస్యలా అనిపించినా, అది కలిగించే నొప్పి వర్ణనాతీతం. ఒక్కసారి ఈ సమస్య వచ్చిన వారిలో సగం మందికి పదేళ్లలోపు మళ్లీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు వైద్యులు, సామాన్యులు నమ్మే ఏకైక సూత్రం 'ఎక్కువ నీళ్లు తాగడం'. కానీ, తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాలు ఈ విషయంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.
1,600 మందిపై నిర్వహించిన ఈ భారీ అధ్యయనంలో.. నీటి వినియోగాన్ని గణనీయంగా పెంచినప్పటికీ, వారిలో రాళ్లు మళ్లీ ఏర్పడే ముప్పు పెద్దగా తగ్గలేదని తేలింది. దీనికి ప్రధాన కారణం 'మనం ఎంత నీళ్లు తాగాం' అనే దానికంటే ‘ఎంత మూత్రం విసర్జించాం’ అనేది ముఖ్యం. కిడ్నీలో రాళ్లను కలిగించే ఖనిజాలను పలుచన చేయాలంటే రోజుకు కనీసం 2.5 లీటర్ల మూత్రం ఉత్పత్తి కావాలి. కేవలం నీళ్లు తాగడం వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు.
కిడ్నీలు మన శరీరంలో వ్యర్థాలను వడపోసే కర్మాగారాలు. మూత్రం చిక్కబడినప్పుడు, అందులోని క్యాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు క్రిస్టల్స్ మారి రాళ్లుగా ఏర్పడతాయి. నీళ్లు తాగడం వల్ల ఇవి పలుచన అవుతాయి, కానీ అది ప్రక్రియలో ఒక భాగం మాత్రమే.
నీళ్ల కంటే కూడా మన ఆహారపు అలవాట్లు కిడ్నీల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' లో ప్రచురితమైన రివ్యూ ప్రకారం.. సోడియం ఎక్కువగా తీసుకుంటే మూత్రంలో క్యాల్షియం విడుదల పెరుగుతుంది, ఇది రాళ్లకు దారితీస్తుంది. ఒకప్పుడు క్యాల్షియం తగ్గించాలనే వారు, కానీ అది తప్పు. సరైన స్థాయిలో క్యాల్షియం తీసుకోవడం వల్లే రాళ్లు ఏర్పడకుండా అడ్డుకోవచ్చు. మాంసాహార ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. పాలకూర, బీట్రూట్ వంటి అధిక ఆక్సలేట్ ఉన్న ఆహారాన్ని అతిగా తీసుకోకూడదు.
మరి నీరు ఎంత తాగాలి? నీటి పరిమాణం అనేది మనం ఉండే వాతావరణం, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం వంటి ఉష్ణదేశాల్లో చెమట రూపంలో నీరు ఎక్కువగా పోతుంది కాబట్టి, మూత్రం రంగును గమనించడం ఉత్తమ మార్గం. మీ మూత్రం పలచగా, లేత పసుపు రంగులో ఉంటే మీరు సరిగ్గా హైడ్రేటెడ్గా ఉన్నారని అర్థం. లేకపోతే ఎక్కువ నీరు తీసుకోవాలి.
కిడ్నీలో రాళ్ల నివారణ అనేది ఒక సమగ్ర ప్రక్రియ. కేవలం నీళ్లు తాగడంపైనే కాకుండా.. సరైన ఆహారం, బరువు నియంత్రణ, వైద్యుల పర్యవేక్షణలో ఉండటం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
E-Paper

