పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ - రూ.2.25 కోట్ల చెక్కు అందజేత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. వారి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని వారి నివాసానికి స్వయంగా చేరుకున్న ఆయన, పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఆయన అకాల మరణం పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గతంలో ప్రకటించిన విధంగానే మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వారి పేరిట చెరొక కోటి రూపాయల చొప్పున మొత్తం రెండు కోట్ల రూపాయల చెక్కులను కేసీఆర్ అందజేశారు. దాంతో పాటు ఆయన తల్లికి రూ. 25 లక్షల చెక్కును స్వయంగా అందజేశారు.
పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. అధినేత రాకతో పెద్ది కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కేసీఆర్తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించే క్రమంలో కేసీఆర్ కూడా భావోద్వేగానికి గురుయ్యారు.
E-Paper

