వెదర్ రిపోర్ట్ : ఏపీకి తేలికపాటి వర్ష సూచన - తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..!
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ,రేపు తేలికపాటి నుంచి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది.
ఏపీకి ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందన పేర్కొంది. అదేవిధంగా దిగువన ట్రోపోస్థాయిలో ఉత్తర -ఈశాన్య గాలులు వీస్తుండటంతో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సోమవారం(నవంబర్ 10) వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు.
(image source @APSDMA)
మరోవైపు తెలంగాణలో వర్షాలు తగ్గిపోగా… చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అంచనా వేసింది.
ఇక నవంబర్ 10 నుంచి తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
(image source @APSDMA X)
ఇక హైదరాబాద్ సిటీలో కూడా చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం పలుచోట్ల పొగమంచు కురిసే పరిస్థితులు ఉంటున్నాయి. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
(AFP File )
E-Paper

